ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
మైదుకూరు : మైదుకూరు – వనిపెంట రహదారిలో ఈనెల 1వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొండపేట గౌస్ (37) అనే వ్యక్తి గురువారం మృతి చెందాడు. మండలంలోని వనిపెంటకు చెందిన గౌస్ 1వ తేదీన సాయంత్రం మైదుకూరు నుంచి బైక్లో వనిపెంటకు వెళుతుండగా కేశలింగాయపల్లెకు సమీపంలో ఎదురుగా వస్తున్న స్కార్పియో వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని చికిత్స కోసం నంద్యాల శాంతిరాం ఆస్పత్రిలో చేర్పించగా పరిస్థితి విషమించడంతో గురువారం మృతి చెందినట్టు అర్బన్ ఏఎస్ఐ శివప్రసాద్రెడ్డి తెలిపారు. మృతునికి భార్య ఉన్నారు. ప్రమాదానికి కారణమైన స్కార్పియో వాహనం డ్రైవర్ చంద్రశేఖర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.
హత్య కేసులో
నిందితుల అరెస్ట్
చింతకొమ్మదిన్నె : మేరీనగర్లో ఈనెల 1వ తేదీ అర్థరాత్రి గొడవ చేసి రాడ్డు, కట్టెలు, కత్తితో ఈశ్వరయ్య, అతని అన్న పెంచలయ్య, ఈశ్వరయ్య కుమారుడు శంకర్ దాడి చేసిన సంఘటనలో గద్వాల పెద్ద సుబ్బరాయుడు, చిన్న సుబ్బరాయుడులకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా చికిత్స పొందుతూ సోమవారం పెద్ద సుబ్బరాయుడు మృతి చెందాడు.ఈ సంఘటనపై చింతకొమ్మదిన్నె సీఐ బాలమద్దిలేటి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.నిందితులు ఈశ్వరయ్య, అతని అన్న అయిన పెంచలయ్యను గురువారం మధ్యాహ్నం అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్లు తెలిపారు.
తెలుగు గంగ కాలువలో
మృతదేహం లభ్యం
బ్రహ్మంగారిమఠం : మండలంలోని పలుగురాళ్ళపల్లె పంచాయతీ జౌకుపల్లె గ్రామం సమీంలోని తెలుగుగంగ సాగునీటి కాలువలో గుండాపురం ఎస్సీకాలనీకి చెందిన పందీటి ఓబులేసు(20) గురువారం శవమై తేలాడు. స్థానిక ఎస్ఐ శివప్రసాద్ వివరాలు ఇలా ఉన్నాయి మృతి చెందిన యువకుడు గుండాపురం ఎస్సీకాలనీకి చెందినవాడిగా గుర్తించినట్లు చెప్పారు. మృతిని కోసం కుటుంబసభ్యులు, బందువులు ఎవరూ రాలేదన్నారు. అనుమాన స్వంద మృతి క్రింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఇంటిని కూల్చేసిన ఘటనలో మరో ఐదుగురు అరెస్ట్
కడప అర్బన్ : కడపలోని ఎరముక్కపల్లె కంది పాలెంలో జనవరి 26న అర్ధరాత్రి సట్టి భాస్కర్, భారవిలకు సంబంధించిన ఇంటిని కూల్చివేశారు. ఈ సంఘటనలో కీలక పాత్ర పోషించిన ముగ్గురు నిందితులతోపాటు, మరో ముగ్గురిని సంఘటన జరిగిన రెండు రోజుల తర్వాత అరెస్టు చేశారు. జేసీబీని సీజ్ చేశారు. ఇదే సంఘటనలో మరో ఐదుగురిని సీఐ చిన్న పెద్దయ్య, తమ సిబ్బందితో కలిసి గురువారం అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుల కోసం ముమ్మురంగా గాలింపు చర్యలను చేపడుతున్నారు.


