బిల్లు జనరేషన్లో జాప్యం సరికాదు
కడప సిటీ : క్షేత్ర స్థాయిలో పని జరిగినప్పటికీ బిల్లు జనరేషన్లో ఎందుకు జాప్యం జరుగుతోందని వాటర్షెడ్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్ షణ్ముఖ్ కుమార్ ఉపాధి హామీ సిబ్బందిని ప్రశ్నించారు. గురువారం కలెక్టరేట్ సభా భవన్లో డ్వామా పీడీ ఆదిశేషారెడ్డితో కలిసి ఆయన ఉపాధి హామీ, పంచాయతీరాజ్ శాఖల క్షేత్ర స్థాయి సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో చేపట్టిన క్యాటిల్ షెల్టర్స్, రోడ్డు పనులకు పరిపాలన అనుమతులు తీసుకున్నట్లు చెప్పారు. వాటిలో పనులు ఏ ప్రగతిలో ఉన్నాయని, ఎన్ని పూర్తి చేశారని అడిగారు. అదేవిధంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో వీబీజీ రామ్జీలోకి పథకం మారుతున్నందున ఇప్పటికే ప్రారంభించిన పనులను ఫిబ్రవరి చివరి నాటికి పూర్తి చేయాలన్నారు. పనులు జరిగిన వాటికి బిల్లు జనరేషన్లో అలసత్వం వహించరాదన్నారు. సమావేశంలో డ్వామా పీడీ ఆదిశేషారెడ్డి, పంచాయతీరాజ్ ఎస్ఈ చిన్న మద్దన్న, ఏపీడీ రామలింగేశ్వర్రెడ్డి, సీసీ భాస్కర్, శ్రీనివాసులు, ఎంపీడీఓలు, ఏపీడీలు, పంచాయతీరాజ్ ఈఈ, డీఈ, ఏఈలు, ఉపాధి హామీ ఏపీఓలు, వీసీలు పాల్గొన్నారు.


