అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం | - | Sakshi
Sakshi News home page

అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం

Jun 13 2026 1:29 PM | Updated on Jun 13 2026 1:29 PM

● శరత్‌ బాబు కుటుంబానికి ఫోన్‌లో పరామర్శించిన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి

కొమరాడ: అధైర్య పడొద్దు.. కుటుంబ సభ్యుల వలే మేమంతా అండగా ఉంటామని, పార్టీ తరఫున సహకారం అందిస్తామని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు, కొమరాడ మండలం రాజ్యలక్ష్మీపురం గ్రామానికి చెందిన నంగిరెడ్డి శరత్‌బాబు గుండెపోటుతో ఇటీవల మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన ఇంటికి మాజీ ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, శత్రుచర్ల పరీక్షిత్‌రాజు దంపతులను పంపించి ఫోన్‌లో శరత్‌బాబు భార్య స్వర్ణ ప్రియ, తల్లి పార్వతమ్మ, తమ్ముడు శ్రావణ్‌కుమార్‌తో జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. ఈ సందర్భంగా వారిని ఓదార్చి మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. చిన్న వయస్సులోనే మృతిచెందడం బాధాకరమన్నారు. మీకు తోడుగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షుడు కళింగ మల్లేశ్వరరావు, మాజీ సర్పంచ్‌ కెంగువ పోలినాయుడు, ఏగిరెడ్డి సింహాచలం, వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.

సీ్త్ర‘నిధి’ స్వాహాపై విచారణ

కొత్తవలస: మండలంలోని పాతసుంకరపాలెం పొదుపు సంఘాల మహిళల నుంచి ‘సీ్త్రనిధి’ రుణాల వాయిదా చెల్లింపుల్లో అదనపు వసూళ్లపై సీ్త్ర‘నిధి’ స్వాహా శీర్షికన ‘సాక్షి’లో ఈ నెల 9న ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. సీ్త్ర నిధి డీజీఎం కృష్ణంనాయుడు, ఏజీఎం సత్యనారాయణ గ్రామంలో శుక్రవారం విచారణ చేపట్టారు. పొదుపు సంఘాల మహిళలు తీసుకున్న రుణాలు, తిరిగి చెల్లింపులపై ఆరా తీశారు. రుణం తీసుకున్న ప్రతి సారీ ఒకటిన్నర నెల అదనంగా వాయిదాలు వసూలు చేసి రూ.లక్షల్లో నిధులు కై ంకర్యం చేసినట్టు మహిళలు తెలిపారు. అనంతరం సీ్త్ర నిధి నుంచి రుణం పొందే తీరు, తిరిగి చెల్లించే పద్ధతులపై డీజీఎం కృష్ణంనాయుడు మహిళలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వెలుగు ఏపీఎం ఎ.వెంకటరమణ, సీసీలు అప్పలనాయుడు, అప్పలస్వామి, తదితరులు పాల్గొన్నారు.

చదువుతోనే భవిత

విజయనగరం క్రైమ్‌: బాలలను పనికి పంపించరాదని, చదివిస్తే ఉజ్వల భవిష్యత్‌ లభిస్తుందని ఎస్పీ ఎ.ఆర్‌.దామోదర్‌ తల్లిదండ్రులకు సూచించారు. అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా డిస్ట్రిక్ట్‌ ఫోరం ఫర్‌ చైల్డ్‌ రైట్స్‌, ఏపీ ప్రో చైల్డ్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలో రూపొందించిన ‘ఆట, పాటలు పిల్లలకు... పని, పాటలు పెద్దలకు’ అనే వాల్‌ పోస్టర్‌ను తన చాంబర్‌లో శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 14 ఏళ్ల వయస్సులోపు పిల్లలతో పనిచేయించడం నేరమన్నారు. అనంతరం పలువురు పిల్లలకు పుస్తకాలు, పెన్నులు అందజేశారు. కార్యక్రమంలో ఫోరం అధ్యక్షుడు పి.చిట్టిబాబు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement