మహారాణిపేట: స్టీల్ప్లాంట్లో జరిగిన దురదృష్టకర ఘటనలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు, గాయపడిన వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ తెలిపారు. మంగళవారం కేజీహెచ్ మార్చురీ వద్ద బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చిన క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు బాధితులు ప్రమాదం నుంచి బయటపడ్డారని చెప్పారు. సెవెన్హి ల్స్ ఆసుపత్రిలో ఉన్న ముగ్గురిలో ఒకరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. బాధిత కుటుంబాలకు టెర్మినల్ బెనిఫిట్స్తో పాటు రూ.25 లక్షల పరిహారం, పిల్లలకు ఉచిత విద్య, నివాస సదుపాయం కొనసాగింపు, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పించే నిర్ణయాలను అమలు చేసే దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు. ఘటనకు గల కారణాలపై కేంద్ర ప్రభుత్వం నియమించిన ముగ్గురు సభ్యుల విచారణ కమిటీ ఇప్పటికే విచారణ ప్రారంభించిందన్నారు.
జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్


