15 నుంచి మత్స్యవేట ప్రారంభం
మహారాణిపేట: ప్రకృతి వైపరీత్యాల నుంచి మత్స్య పరిశ్రమ, మరపడవలు, మత్స్యకారులకు రక్షణ కల్పించాలని కోరుతూ విశాఖ ఫిషింగ్ హార్బర్లో మంగళవారం గంగమ్మ తల్లికి విశేష పూజలు నిర్వహించారు. బోటు యజమానులు, మత్స్యకారులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి మొక్కుబడులు చెల్లించారు. గంగమ్మ తల్లితో పాటు సముద్రుడికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రాష్ట్ర మరపడవల సంఘం నాయకులు మైలపల్లి లక్ష్మణరావు, పీ.సీ.అప్పారావు, మున్నం బాలాజీ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్, ఎంపీ భరత్, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, ఎన్టీఆర్ వైద్య సేవల చైర్మన్ సీతంరాజు సుధాకర్ తదితరులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 61 రోజుల విరామం అనంతరం ఈ నెల 14 అర్ధరాత్రి నుంచి మత్స్యవేట పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో మత్స్యకారులు అత్యంత భక్తిశ్రద్ధలతో గంగమ్మ జాతరను నిర్వహించారు. హార్బర్ ప్రాంతం భక్తులతో కిక్కిరిసిపోయి ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.


