ఎంవీపీకాలనీ: రాష్ట్రంతో పాటు జాతీయ స్థాయిలో ఉన్నత విద్యాభివృద్ధికి తోడ్పడాలనే లక్ష్యంతో ‘విశాఖ ఫార్మర్ వైస్ చాన్స్లర్స్ ఫోరం’ ఆవిర్భవించింది. ఫోరం తొలి సమావేశాన్ని మంగళవారం ఎంవీపీ కాలనీలోని ఐఐఏఎం వేదికగా నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ వీసీలు ఆచార్య వి. బాలమోహన్దాస్, ఆచార్య సుంకరి రామకృష్ణ, ఆచార్య హెచ్. లజపతిరాయ్, ఆచార్య కె. నిరూపమారాణి, ఆచార్య వీఎస్ఆర్కే ప్రసాద్, ఆచార్య పి. శ్యాంప్రసాద్, ఆచార్య ఎస్.వి. సుధాకర్, ఆచార్య జేవీ ప్రభాకర్రావు తదితరులు హాజరయ్యారు. ఐఐఏఎం చైర్మన్ సుంకరి రవీంద్ర, రీడ్ గ్రూప్ డైరెక్టర్ జనరల్ ఆచార్య వి. కృష్ణమోహన్ వారికి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉన్నత విద్యాభివృద్ధికి ఫోరం మేధో వేదికగా నిలవాలని తీర్మానించారు. జాతీయ విద్యా విధానం–2020 అమలులో ఆంధ్రప్రదేశ్ చురుకై న పాత్ర పోషించేందుకు అవసరమైన సూచనలు చేయడం, విద్యార్థుల్లో నైపుణ్యాలు, నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలు, విశ్లేషణాత్మక, విమర్శనాత్మక ఆలోచనలను పెంపొందించడం, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడం, సామాజిక బాధ్యతను పెంపొందించే కార్యక్రమాలకు సహకరించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆచార్య బాలమోహన్దాస్ మాట్లాడుతూ విశాఖతో పాటు ఉత్తరాంధ్రలోని మాజీ వీసీలంతా ఫోరంలో భాగస్వాములు కావాలని కోరారు.


