డిప్యూటీ సీఎం పవన్కు అవగాహన లేదు మంత్రి లోకేష్ ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నారు వైఎస్సార్సీపీ గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్రెడ్డి
సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వం వచ్చాక స్టీల్ ప్లాంట్ను పూర్తిగా నిర్వీర్యం చేశారని, ప్లాంట్లో జరుగుతున్న ప్రమాదాలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని వైఎస్సార్సీపీ గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం కేజీహెచ్లో మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన మీడియాతో మాట్లాడారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి స్టీల్ప్లాంట్ను ప్రైవేటీకరించే కుట్రలో భాగంగానే సుమారు 6 వేల మంది కాంట్రాక్టు కార్మికులను, 1,800 మంది రెగ్యులర్ ఉద్యోగులను ఇంటికి పంపించారని ధ్వజమెత్తారు. చివరికి ప్లాంట్ లోపల కార్మికుల ఆకలి తీర్చే క్యాంటీన్ సౌకర్యాన్ని కూడా నిలిపివేయడం దారుణమని, వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ప్లాంట్ నిర్వీర్యం, యాజమాన్య నిర్లక్ష్యం కారణంగా జరిగిన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
లోకేష్, పవన్ కల్యాణ్లపై తీవ్ర విమర్శలు
కార్మికుల ప్రాణాలకు, ప్లాంట్ దుస్థితికి సమాధానం చెప్పలేక ఫ్రస్ట్రేషన్తో ఐటీ మంత్రి లోకేష్ కార్మిక సంఘాలపైనే తిరగబడుతున్నారని, ఆయన తీరు ఏమాత్రం సరికాదని మండిపడ్డారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్లాంట్ సంక్షోభంపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.


