సింహాచలం : శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని ఆదివారం ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విమల్కుమార్ యాదవ్ సతీసమేతంగా దర్శించుకున్నారు. ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. బేడా మండపంలో ప్రదక్షిణ చేశారు. అంతరాలయంలో ఆయన పేరిట అర్చకులు అష్టోత్తర పూజ నిర్వహించారు. వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామివారి చిత్రపటం, శేషవస్త్రం, ప్రసాదాన్ని ఏఈవో తిరుమలేశ్వరరావు అందజేశారు.
నేడు లేబర్ ట్రిబ్యునల్కు కార్మిక నాయకులు
ఉక్కునగరం : స్టీల్ప్లాంట్ కార్మిక నాయకులు సోమవారం హైదర్బాద్లోని ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ కమ్ లేబర్ కోర్టుకు హాజరవుతున్నారు. ఉత్పత్తి ఆధారంగా వేతనాలు చెల్లిస్తామని గత ఏడాది నవంబర్ 15న నాటి ఉక్కు యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను స్టీల్ ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అయినప్పటికి యాజమాన్యం సంప్రదించక పోవడంతో విశాఖలోని రీజనల్ లేబర్ కమిషనర్ (ఆర్ఎల్సీ)కు ఫిర్యాదు చేశారు. ఆర్ఎల్సీ విచారణ అనంతరం ఉత్తర్వులు కార్మిక చట్టాలకు వ్యతిరేకమని, ఆ ఉత్తర్వులను రద్దు చేసి పూర్తి వేతనాలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలను ఉక్కు యాజమాన్యం అంగీకరించక పోవడంతో ఆర్ఎల్సీ ఈ అంశాలన్ని ట్రిబ్యునల్కు రిఫర్ చేశారు. ఈ అంశంపై ఈ నెల 8న లేబర్ కోర్టుకు హాజరు కావాలని ట్రిబ్యునల్ కోర్టు కార్మిక సంఘాలకు నోటీసులు జారీ చేసింది.


