ఎంవీపీకాలనీ: సహజ యోగా ట్రస్ట్, బాలశక్తి టీమ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత సహజ యోగ ధ్యాన పరిచయ కార్యక్రమానికి నగర వాసుల నుంచి విశేష స్పందన లభించింది. ఎంవీపీ కాలనీలోని గాధిరాజు ప్యాలెస్ వేదికగా మూడు రోజులుగా జరుగుతున్న ఈ శిక్షణా తరగతులు ఆదివారంతో ముగిశాయి. ఇందులో వేల మంది నగరవాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ రాష్ట్ర కో–ఆర్డినేటర్ రామకృష్ణ మాట్లాడుతూ నిత్యజీవితంలో ఒత్తిడి, ఆందోళనలతో సతమతమవుతున్న ప్రజలు ధ్యానం ద్వారా వాటిని ఎలా అధిగమించవచ్చో వివరించారు. చిన్నారులకు బాలశక్తి టీమ్ ఆధ్వర్యంలో ధ్యానం, ఏకాగ్రత, సంస్కారవంతమైన జీవనం వంటి అంశాలపై ప్రత్యేక తరగతులు నిర్వహించారు. కార్యక్రమంలో ట్రస్ట్ జాతీయ ఉపాధ్యక్షుడు భల్లా, జాతీయ సభ్యుడు మధుసుదన్రావు, ఏపీ సమన్వయకర్త రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


