తాటిచెట్లపాలెం: మారుతున్న ఆధునిక జీవనశైలి కారణంగా ప్రస్తుత రోజుల్లో జీర్ణాశయ, కాలేయ సంబంధిత సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయని సీనియర్ కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, సదస్సు నిర్వహణ కమిటీ చైర్మన్ డాక్టర్ చలపతిరావు ఆచంట ఆందోళన వ్యక్తం చేశారు. కిమ్స్ హాస్పిటల్స్ (సీతమ్మధార) పరిధిలోని ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ గ్యాస్ట్రో సైన్సెస్’ ఆధ్వర్యంలో.. ఏపీఐ, ఐఎంఏ, వైజాగ్ గట్ క్లబ్ సంయుక్తంగా ‘గ్యాస్ట్రో అప్డేట్–4వ ఎడిషన్’ పేరిట జాతీయస్థాయి వైద్య విద్యా సదస్సును ఆదివారం ఆసుపత్రిలో నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ చలపతిరావు మాట్లాడుతూ.. క్లిష్టమైన కేసులపై జరిగే ఇలాంటి అకడమిక్ చర్చలు వైద్యుల వ్యాధి నిర్ధారణ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు, రోగులకు మరింత మెరుగైన చికిత్స అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఈ సదస్సులో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, భువనేశ్వర్, అహ్మదాబాద్ వంటి ప్రముఖ నగరాల నుంచి వచ్చిన వైద్య నిపుణులు పలు క్లిష్టమైన ఆరోగ్య సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ సీఈఓ డాక్టర్ అభినయ్, రీజనల్ సీఈఓ డాక్టర్ నాగేష్లు మాట్లాడుతూ.. సదస్సు విజయవంతానికి సహకరించిన అధ్యాపకులు, ప్రతినిధులు, భాగస్వామ్య సంస్థలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


