ఎంవీపీకాలనీ: అప్పుఘర్ కూడలి వద్ద ఓ కారులో మంటలు చెలరేగిన ఘటన శుక్రవారం జరిగింది. వివరాలిలా.. మహేంద్ర ఎక్స్యూవీ కార్ బీచ్ రోడ్డులో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. ఎంవీపీ అప్పుఘర్ కూడలి వద్దకు చేరుకునే సరికి ఒక్కసారిగా కారు నుంచి పొగలు కమ్ముకున్నాయి. కారులో ప్రయాణిస్తున్న వారు అప్రమత్తమై వెంటనే దిగి బయటకు వచ్చేశారు. వారు బయటకొచ్చిన కొన్ని నిమిషాల్లో కారు నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. స్థానికులు ఎంవీపీ పోలీసులతోపాటు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. స్థానికుల సాయంతో వారు మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో కారులోని వారికి ఎలాంటి గాయాలు కాలేదని ఎంవీపీ పోలీసులు తెలిపారు.


