ప్రజాభిప్రాయమా.. కాపీ–పేస్ట్ అభిప్రాయాలా?
సీఆర్జెడ్ మార్పు వంటి కీలక అంశంపై ప్రజల అభిప్రాయాలను సేకరించాలని ఏపీసీజెడ్ఎంఏ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. కానీ ప్రజల స్పందన పేరుతో సమర్పించిన పత్రాల్లో ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగుచూశాయి. వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తుల పేర్లతో నమోదైన అభిప్రాయాలన్నీ దాదాపు ఒకే భాషలో, ఒకే వాక్య నిర్మాణంతో, ఒకే పదజాలంతో ఉండటం చర్చనీయాంశంగా మారింది. పేర్లు మారాయి కానీ అభిప్రాయాలు మాత్రం అక్షరాలా ఒకేలా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. కనీసం ఒక్క పదం కూడా మార్చకుండా ఒకే అభిప్రాయాన్ని పదుల సంఖ్యలో జతచేయడం వెనుక అసలు ప్రజల స్పందన ఉందా? లేక ముందుగానే తయారు చేసిన ముసాయిదాలను వివిధ పేర్లతో జోడించారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ అభిప్రాయాలను సమర్పించిన వారి పూర్తి చిరునామాలు, సంప్రదింపు వివరాలు కూడా చాలాచోట్ల లేవు. దీంతో ఇవి నిజమైన ప్రజాభిప్రాయాలా? లేక అధికార పార్టీ అనుచరులు సమీకరించి సమర్పించిన పత్రాలా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.


