జీవీఎంసీ కమిషనర్ కేతన్గార్గ్ ఆదేశం
డాబాగార్డెన్స్ : నగర పరిధిలో భవన నిర్మాణ అనుమతులు, ఎల్ఆర్ఎస్, టీడీఆర్ల మంజూరులో ఎలాంటి జాప్యం లేకుండా.. నిర్ణీత గడువులోపు ప్రక్రియ పూర్తి చేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పట్టణ ప్రణాళికా అధికారులను ఆదేశించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో గురువారం చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకరరావుతో పాటు ఇతర టౌన్ ప్లానింగ్ అధికారులతో కమిషనర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర ప్రజలు భవన నిర్మాణ అనుమతుల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు సమర్పిస్తున్నప్పటికీ వాటి పరిష్కారంలో అనవసర జాప్యం జరుగుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎల్ఆర్ఎస్ పథకం కింద వచ్చిన దరఖాస్తుల పరిశీలన, మంజూరు ప్రక్రియలో కూడా నిర్లక్ష్యం కనిపిస్తోందని పేర్కొన్నారు. ఏపీ డీపీఎంఎస్ పోర్టల్లో నమోదైన భవన నిర్మాణ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, రెండు రోజుల కంటే ఎక్కువ ఆలస్యం చేయకుండా సంబంధిత ఉన్నతాధికారులకు పంపాలని సూచించారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల విషయంలోనూ క్షేత్రస్థాయి పరిశీలన త్వరితగతిన పూర్తి చేసి, జాప్యం లేకుండా నిర్ణయాలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్ అనుమతుల నమోదు ప్రక్రియలోనూ లోపాలు, ఆలస్యాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. సమావేశంలో సిటీ ప్లానర్ ధనుంజయరెడ్డి, డిప్యూటీ సిటీ ప్లానర్లు మధుసూధనరావు, రామ్మోహన్, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు తిరుపతిరావు, రామలింగేశ్వరరెడ్డి, ఝాన్సీ, లక్ష్మీ షబ్నం, శాస్త్రి, రామకృష్ణ, టీపీవోలు, టీపీబీవోలు, సర్వేయర్లు పాల్గొన్నారు.


