మహారాణిపేట: ఈ నెల 5, 8వ తేదీల్లో జరిగే సీఎం చంద్రబాబు జిల్లా పర్యటనలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో సీపీ శంఖబ్రత బాగ్చితో కలిసి ఏర్పాట్లపై సమీక్షించారు. 5న నోవాటెల్ వేదికగా సముద్ర ఆహార ఎగుమతులపై జరిగే సదస్సులో కేంద్ర మంత్రులతో కలిసి సీఎం పాల్గొంటారన్నారు. సాయంత్రం విశాఖ ఎకనామిక్ రీజియన్పై సమీక్షిస్తారని తెలిపారు. ఆ రోజు తాడేపల్లి నుంచి నేరుగా బీచ్రోడ్డులోని కోస్టల్ బ్యాటరీ వద్ద ఉన్న హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారన్నారు. షెడ్యూ ల్ ప్రకారం ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. 8న తాడేపల్లి నుంచి రుషికొండ హెలీప్యాడ్కు చేరుకుంటారని, అక్కడి నుంచి ఇస్కాన్ టెంపుల్ సమీపంలోని విద్యుత్ శాఖ సీవోఈఈటీ భవనానికి రోడ్డు మార్గం ద్వారా వెళ్తారని తెలిపారు. ఆ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అక్కడ జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. లంచ్ తర్వాత రుషికొండ హెలీప్యాడ్ నుంచి తర్లువాడ చేరుకుని అక్కడ గూగుల్ డేటా సెంటర్ సమీపంలో జరిగే ఎపిస్ టెక్నాలజీస్ సెమీకండక్టర్ యూనిట్ భూమి పూజ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతార ని వెల్లడించారు. అనంతరం తర్లువాడ నుంచి లేదా ఎయిర్పోర్టు నుంచి తాడేపల్లికి తిరుగుముఖం పడతారని పేర్కొన్నారు. సాయంత్రం వీరంతా కలిసి కార్యక్రమ వేదికలు, హెలీప్యాడ్లు, సంబంధిత ప్రాంతాలను పరిశీలించారు. సమావేశంలో ఈపీడీసీఎల్ సీఎండీ ఇమ్మడి పృధ్వీతేజ్, జేసీ గొబ్బిళ్ల విద్యాధరి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్, ఎన్ఎఫ్డీసీ సీఈవో విజయ్కుమార్, డీసీపీలు లతామాధురి, మణికంఠ, డీఆర్వో ఎం.విశ్వేశ్వరనాయుడు, ఆర్డీవో శేషశైలజ, ఎపిస్ టెక్నాలజీ, ఎంపెడా, మత్స్యశాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
అధికారుల సమీక్షలో కలెక్టర్ అభిషిక్త్ కిశోర్


