మహారాణిపేట: సమాచార పౌర సంబంధాల శాఖలో వివిధ హోదాల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన వడలి మణిరామ్ సేవలు ఆదర్శనీయమని విశాఖ డీడీ కె.సదారావు ప్రశంసించారు. 39 ఏళ్ల పాటు వివిధ హోదాల్లో సేవలందించి ఆర్జేడీ హోదాలో పదవీ విరమణ చేసిన మణిరామ్కు ఆ శాఖ ఉత్తరాంధ్ర జిల్లాల ఉద్యోగులు, సిబ్బంది జెడ్పీ సమావేశ మందిరంలో ఆదివారం వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. దుశ్శాలువాలు కప్పి, జ్ఞాపికలు అందజేసి మణిరామ్ దంపతులను ఆత్మీయంగా సత్కరించారు. ఈ సందర్భంగా డీడీ మాట్లాడుతూ మణిరామ్ అందరికీ తలలో నాలుకలా ఉంటూ ఉత్తమ సేవలందించారని, అనతి కాలంలోనే పెద్దపెద్ద పదవులను అధిరోహించారని గుర్తు చేశారు. అనంతరం పదవీ విరమణ చేసిన ఆర్జేడీ వి.మణిరామ్ మాట్లాడుతూ ఇన్నేళ్ల సర్వీసులో తనకు సహాయ, సహకారాలు అందించిన ఉన్నతాధికారులకు, సహోద్యోగులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయనగరం, శ్రీకాకుళం డీఐపీఆర్వోలు గోవిందరాజు, చెన్నకేశవరావు, ఆర్జేడీ కార్యాలయ సూపరింటెండెంట్ అన్నమ్మ, ఏఎస్సార్ జిల్లా ఇన్చార్జ్ డీఐపీఆర్వో వెంకటరావు, సమాచార పౌర సంబంధాల శాఖ విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఆర్.త్యాగరాజు, ట్రెజరర్ పి.గోవిందరావు, కార్యదర్శి పి.వెంకటప్పారావు, ఉపాధ్యక్షుడు ఎ.బాబ్జీ తదితరులు పాల్గొన్నారు.


