2029లో జగన్మోహన్రెడ్డి సీఎం కావాలంటే ‘సర్’ చాలా కీలకం
పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు
29వ వార్డులో వైఎస్సార్ సీపీ దక్షిణ బూత్ ఏజెంట్లకు శిక్షణ
డాబాగార్డెన్స్: రానున్న స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సత్తా చాటాలన్నా, 2029లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలన్నా ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’(సర్) కార్యక్రమం అత్యంత కీలకమని పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ పేర్కొన్నారు. డాబాగార్డెన్స్లో శనివారం 29వ వార్డు అధ్యక్షుడు పీతల వాసు అధ్యక్షతన, వాసుపల్లి గణేష్కుమార్ ఆధ్వర్యంలో దక్షిణ నియోజకవర్గ బూత్ ఏజెంట్లకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం, ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్ కార్యక్రమ ముఖ్యోద్దేశాన్ని, లక్ష్యాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా బూత్ లెవెల్ ఏజెంట్లకు వివరించారు. సమావేశంలో పార్టీ దక్షిణ పరిశీలకుడు వీసం రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు, పార్టీ క్రిస్టియన్ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జాన్వెస్లీ, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ హర్షవర్ధన్ రెడ్డి తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా జరుగుతున్న సర్ సర్వే పేరిట కొన్ని రాష్ట్రాల్లో భారీ ఎత్తున ఓట్లను తొలగించారని, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలోనూ ఈ ప్రక్రియ ప్రారంభమవుతున్నందున పార్టీ బూత్ ఏజెంట్లు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ఓటర్ల జాబితా సవరణలో జరిగే అవకతవకలపై ప్రతి బూత్ కమిటీ సభ్యుడు నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. దక్షిణ నియోజకవర్గానికి సంబంధించిన బీఎల్ఏ ఫారాలు ఇప్పటికే సిద్ధం చేశామని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో గెలుపు అనేది పూర్తిగా బూత్ స్థాయి నిర్వహణపైనే ఆధారపడి ఉంటుందని, పార్టీ విజయానికి కార్యకర్తలే వెన్నెముక అని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త ఓటరుతో మమేకమై పార్టీ సిద్ధాంతాలను, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని నాయకులు స్పష్టం పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, మాజీ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
బీఎల్ఏల శిక్షణా కార్యక్రమంలో మాట్లాడుతున్న వాసుపల్లి గణేష్కుమార్
ప్రతి బూత్కి సంబంధించి ఓటర్ల జాబితా చూపుతున్న బీఎల్ఏలు


