జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) పరిధిలో నిర్వహించే పరీక్షల్లో అందుబాటులో ఉండేందుకు వీలుగా సిద్ధంగా ఉంచే ‘టెస్టింగ్ పూల్’ జాబితాలో ఇద్దరు భారత క్రికెటర్లను కొత్తగా చేర్చారు. ఓపెనర్ అభిషేక్ శర్మ, ఆల్రౌండర్ అక్షర్ పటేల్ల పేర్లు ఇప్పుడు ‘నాడా’ జాబితాలోకి వచ్చాయి. ఇప్పటి వరకు ఉన్న క్రికెటర్లు స్మృతి మంధాన, శ్రేయస్ అయ్యర్లను తప్పించి వారి స్థానంలో ఈ రెండు పేర్లను జోడించారు.
ఈ జాబితాలో ఉండే ఆటగాళ్లు ఏడాది పాటు డోపింగ్ పరీక్షల కోసం అందుబాటులో ఉండాలి. నిబంధనల ప్రకారం ఎప్పుడు, ఎక్కడ ఉంటున్నారో తమ గురించి సమాచారం అందించాల్సి ఉంటుంది. లేదంటే డోపింగ్ నిబంధనలను ఉల్లంఘించినట్లు అవుతుంది. మొత్తం 348 మందితో కూడిన జాబితాను ‘నాడా’ విడుదల చేసింది.
వీరిలో అత్యధిక సంఖ్యలో 118 మంది అథ్లెట్లు ఉండగా...భారత క్రికెటర్లు గిల్, జైస్వాల్, హార్దిక్ పాండ్యా, పంత్, బుమ్రా, రాహుల్, అర్ష్ దీప్, తిలక్ వర్మ వచ్చే ఏడాది కూడా కొనసాగనున్నారు. మహిళా క్రికెటర్లు దీప్తి శర్మ, షఫాలీ వర్మ, రేణుకా సింగ్ కూడాఈ జాబితాలో ఉన్నారు.


