వట్పల్లి(అందోల్): అనుమతుల్లేకుండా సింగూరు ప్రాజెక్టు శివారు ప్రాంతంలోని అక్రమంగా తవ్విన చేపల చెరువులను సోమవారం అధికారులు ధ్వంసం చేశారు. ఈ అక్రమ చేపల చెరువుల ఏర్పాటుపై స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేపట్టిన జిల్లా అధికార యంత్రాంగం మొత్తం 14 అక్రమ చెరువులను గుర్తించింది. దీంతో నీటిపారుదల, రెవెన్యూ, పోలీసు శాఖలకు చెందిన అధికారులు మండలంలోని ఖాదిరాబాద్ శివారు ప్రాంతాలకు చేరుకుని 14 చెరువులను జేసీబీలతో ధ్వంసం చేశారు. అటు తర్వాత ఉసిరికపల్లి గ్రామంలో అక్రమ చెరువులను కూడా ధ్వంసం చేశారు. ఇరిగేషన్శాఖ ఈఈ భీమ్, సింగూరు ప్రాజెక్టు డీఈ మధుసూధన్, ఏఈ పరుశరాం, డిప్యూటీ ఈఈ రవికుమార్, అందోలు ఏఈ రోహిత్ విశ్వశర్మలతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
కాళ్లా వేళ్లా పడ్డ నిర్వాహకులు
ఈ క్రమంలో చేపలు పూర్తిస్థాయిలో పెరగకముందే మధ్యలోనే చెరువులను ధ్వంసం చేయడంపై చెరువుల నిర్వాహకులు ఆందోళనకు గురయ్యారు. తమ భార్యల బంగారం తాకట్టుపెట్టి రూ.లక్షల వ్యయంతో చేపల చెరువుల తవ్వించామని, వాటిలో చేపలను మరోచోటకు తరలించేందుకు మూడు రోజులు గడువు ఇవ్వాలని అధికారులను వేడుకున్నారు. అయినప్పటికీ కలెక్టర్ ఆదేశాల మేరకు చెరువులను ధ్వంసం చేసేశారు.
సింగూరు శివారులో
14 చేపల చెరువులు
స్థానికుల ఫిర్యాదుతో
కదిలిన యంత్రాంగం


