హుస్నాబాద్రూరల్: రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే దుకాణాలు సీజ్ చేస్తామని ఏఓ పూజ, ఎస్సై లక్ష్మారెడ్డి హెచ్చరించారు. సోమవారం సాక్షిలో ప్రచురితమైన ‘రైతులపై సీడ్ పంజా’ కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. హుస్నాబాద్ పట్టణంలో పోలీసులు, వ్యవసాయ అధికారులు తనిఖీ చేపట్టారు. ప్రభుత్వ అనుమతి ఉన్న ఎరువులు, విత్తనాలనే రైతులకు విక్రయించాలని, లాభాల కోసం అనుమతి లేని కొత్త రకం క్రిమిసంహారక మందులు అమ్మితే కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రభుత్వ ఆమోదిత వరి సన్న రకాలను విక్రయించాలని సూచించారు. దిగుబడులు వస్తాయని రైతులకు ఆశ చూపి సీడ్ కంపెనీల ఏజెట్ల దగ్గర విత్తనాలు తీసుకొని అమ్మితే దుకాణాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. అమ్మిన ప్రతి వస్తువుకూ రైతులకు రసీదు ఇవ్వాలన్నారు. ఎరువులు, విత్తనాల వివరాలను దుకాణం ఎదుట స్టాక్ బోర్డులో పెట్టాలని ఆదేశించారు.


