● 15న తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభం ● త్వరగా అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించాలి ● రాష్ట్ర స్కూల్స్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్
మర్కూక్(గజ్వేల్): సర్కారు బడుల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర స్కూల్స్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో నిర్మించిన పోలీస్ క్వార్టర్స్ సముదాయాలను నూతనంగా ఏర్పాటు చేయనున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కోసం మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెంటనే ప్రీ ప్రైమరీ నుంచి 8వ తరగతి వరకు అడ్మిషన్స్ సేకరించాలన్నారు. ఈ నెల 15న స్కూల్ను ప్రారంభించి నూతన అధ్యయనానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుందన్నారు. తరగతి గదులు, డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలు, కంప్యూటర్ ల్యాబ్లు, ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు, క్రీడామైదానాలు, ఇండోర్ స్పోర్ట్స్ సదుపాయాలు, ప్రీ ప్రైమరీ నుంచి హైస్కూల్ వరకు సమగ్ర విద్యావ్యవస్థ, ల్యాబ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలో ఇద్దరు ప్రీ ప్రైమరీ ఉపాధ్యాయు లు, ఎడుగురు ఎస్జీటీలు, ఎడుగురు స్కూల్ అసిస్టెంట్లు, ఒక పీఈటీ, ఒక పీడీని నియమించాలని జిల్లా విద్యాధికారి శాసీ్త్రకి ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు రవాణా సదుపాయాలతో పాటు ఈ నెల 15 నుంచి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ షఫీ, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ శ్రీనివాస్రెడ్డి, విద్యాశాఖ జిల్లా సెక్టోరియల్ అధికారి రామస్వామి, తహసీల్దార్ సరిత, మండల విద్యాధికారులు ఉదయ్ భాస్కర్ రెడ్డి, సైదులు, డీఈ నాగరాజు, ఏఈ రాజేశ్ తదితరులు పాల్గొన్నారు


