జహీరాబాద్ టౌన్: జల్సాలకు అలవాటు పడి తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని జహీరాబాద్ టౌన్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రూ.2.35 లక్షల విలువ చేసే మూడు తులాల బంగారం, 15 తులాల వెండిని స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్ఐ లవకుమార్తో కలిసి డీఎస్పీ సైదానాయక్ కేసు వివరాలు వెల్లడించారు. కర్నాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లా చించోళి తాలుకా గరగపల్లి గ్రామానికి చెందిన అమ్రేశ్(22) జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్నాడు. పగలు తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నాడు. జహీరాబాద్ పట్టణంలోని బాగారెడ్డి విగ్రహం వద్ద ఎస్ఐ.లవకుమార్ సిబ్బంది వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా వారిని చూసి పారిపోతుండగా పట్టుకొని విచారించారు. పట్టణంలోని పలు ఇళ్లలో చోరీలు చేశానని నేరం అంగీకరించాడు. దీంతో అతడ్ని కోర్టులో రిమాండ్ చేశారు. కేసు ఛేదించిన ఎస్ఐ లవకుమార్, పోలీసు సిబ్బంది నర్సింహులు, పృథ్వీ, హరినేత్రలను డీఎస్పీ అభినందించారు.
నిందితుడి అరెస్టు
బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం


