జహీరాబాద్: స్థానిక మున్సిపల్ పరిధిలోని హోతి(కె) శివారుతో పాటు పస్తాపూర్లోని జర్నలిస్టు కాలనీలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లకు రక్షణ కరువైంది. ఇళ్ల నిర్మాణం పూర్తయినా చుట్టూ ప్రహరీ నిర్మించకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హోతి(కె)లో 660 ఇళ్లు, పస్తాపూర్ జర్నలిస్టు కాలనీలో 40 డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రభుత్వం నిర్మించింది. అయితే, ఈ కాలనీల చుట్టూ ప్రహరీ, ప్రధాన గేట్లు నిర్మించలేదు. కాలనీల పరిసరాల్లో వ్యవసాయ భూములు ఉండడంతో తరచూ ఇండ్లలోకి పాములు వస్తూ నివాసితులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. మరోవైపు భద్రత లేకపోవడంతో కాలనీల్లోకి బయటి వ్యక్తుల సంచారం పెరిగింది. ప్రహరీ లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది దుండగులు దొంగలు పట్టపగలే చోరీలకు పాల్పడుతున్నారు. దీంతో ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లాలంటేనే కాలనీవాసులు వణికిపోతున్నారు. రహమత్నగర్ కాలనీ తరహాలోనే తమ కాలనీలకు కూడా ప్రహరీల నిర్మాణానికి నిధులు మంజూరు చేసి, రక్షణ కల్పించాలని అధికారులను వేడుకుంటున్నారు.
ప్రహరీలకు నోచుకోని
డబుల్ బెడ్రూం ఇళ్లు
పాముల సంచారంతో ఇబ్బందులు
సమస్యలు పరిష్కరించాలని
నివాసితుల వేడుకోలు


