రాష్ట్ర పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ శ్యాం ప్రసాద్లాల్
హత్నూర(సంగారెడ్డి): ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ స్పష్టం చేశారు. హత్నూర మండలం బోరుపట్ల ధాన్యం కొనుగోలు కేంద్రంతోపాటు రైస్మిల్లును శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రైతులకు ఇబ్బంది కలగకుండా త్వరితగతిన ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల నుంచి రైస్మిల్లుకు వెళ్లిన ధాన్యం లారీలను వెంటనే అన్లోడ్ చేసి కొనుగోలు కేంద్రాలకు పంపాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలలో కూడా ధాన్యాన్ని వెంటనే తూకం వేసి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత కొనుగోలు కేంద్రం నిర్వాహకులపై ఉందన్నారు. రైతులకు ఇబ్బంది కలిగితే మాత్రం అధికారులతోపాటు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులపై చర్యలు తప్పవని పేర్కొన్నారు. ఆయనతోపాటు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బాలసరోజ, పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజింగ్ డైరెక్టర్ జైశ్రీలాల్, పీఏసీఎస్ చైర్మన్ దుర్గారెడ్డి, డీటీ కర్ణాకర్రావు, సీఓ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.


