సిద్దిపేటకమాన్: మురుగు కాలువలో పడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. టూటౌన్ సీఐ మురళి వివరాల ప్రకారం... పట్టణంలోని బోయిగల్లికి చెందిన రాములుగౌడ్ (52) స్థానికంగా లాల్కమాన్ ప్రాంతంలో పానీపురి దుకాణం నిర్వహిస్తున్నాడు. రాములుగౌడ్ శుక్రవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి రాత్రి వరకు కూడా తిరిగి ఇంటికి రాలేదు. ఈ మేరకు శనివారం వేములవాడ కమాన్కు సమీపంలో ఉన్న ఓ వైన్షాప్ పర్మిట్ రూమ్ సమీపంలో మురుగునీటి కాల్వలో రాములుగౌడ్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మద్యం మత్తులో మురుగు కాలువలో పడి ఊపిరాడక మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి కుమారుడు భానుప్రకాశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.


