సంగారెడ్డి: నాణ్యతా ప్రమాణాలు పాటించని షాపుల నుంచి తనిఖీల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల నమూనాలు సేకరించారు. వివిధ రకాల 18 మంది వ్యాపారులకు రూ. 63 లక్షల తొమ్మిది వేల జరిమానాను జిల్లా అదనపు కలెక్టర్ సంగీత విధించారు. తాము నిర్వహించిన తనిఖీల్లో నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపితే టెస్టింగులో నాణ్యత ప్రమాణాలు లోపించాయని పేర్కొన్నారు. దీంతో బాధ్యులకు పెనాల్టీ విధించారని ఫుడ్ సేఫ్టీ అధికారి రాజేశ్ తెలిపారు.
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు
నర్సాపూర్: గంజాయి అమ్మడానికి యత్నిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక ఎస్ఐ రంజిత్రెడ్డి కథనం ప్రకారం... నర్సాపూర్లోని శ్రీరాంనగర్ కాలనీకి చెందిన నరేశ్గౌడ్, మండలంలోని రెడ్డిపల్లికి చెందిన నరేశ్ ఇతర ప్రాంతం నుంచి తెచ్చిన గంజాయిని స్థానిక పిల్లల పార్కు ఏరియాలో శనివారం అమ్మడానికి ప్రయత్నిస్తుండగా అదుపులోకి తీసుకొని రిమాండుకు పంపించారు. వారి నుంచి అరకిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు.
ఓఆర్ఆర్పై కారు దగ్ధం
జిన్నారం (పటాన్చెరు): ప్రయాణిస్తున్న కారులో మంటలు చెలరేగి దగ్ధమైంది. ఈ ఘటన బొల్లారం పరిధిలోని ఓఆర్ఆర్పై చోటు చేసుకుంది. గడ్డపోతారం మున్సిపల్ వైస్ చైర్మన్ మహేందర్ గౌడ్కు చెందిన స్కార్పియో కారు మేడ్చల్ నుంచి సుల్తాన్పూర్ వస్తుండగా కారు ముందు భాగంలో మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ కారును రోడ్డు పక్కన నిలిపి కిందకు దిగాడు. మంటల్లో కారు పూర్తిగా దగ్ధమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.


