పటాన్చెరు టౌన్: రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రతీక్జైన్ అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారి–65 పై సంగారెడ్డి నుంచి పటాన్చెరు వరకు కొనసాగుతున్న రోడ్డు విస్తరణ, నిర్మాణ పనుల పురోగతిని కలెక్టర్ ప్రతీక్జైన్, ఎస్పీ పరితోశ్ పంకజ్ శుక్రవారం సంబంధిత శాఖల అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రోడ్డు నిర్మాణ పనులు, వాటర్ లాగింగ్ పాయింట్లు, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ స్తంభాల తరలింపు, నీటి పైప్లైన్ల షిఫ్టింగ్, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...బ్లాక్ స్పాట్ల వద్ద తాత్కాలిక భద్రతా ఏర్పాట్లు చేయడంతోపాటు, రోడ్డు పక్కన ఉన్న డ్రైనేజీలపై స్లాబులు ఏర్పాటు చేసి మూసివేయాలన్నారు. అవసరమైన చోట వాటర్ పైప్లైన్లను వెంటనే షిఫ్ట్ చేయడంతోపాటు ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. రోడ్డు విస్తరణ పనులకు అడ్డంగా ఉన్న విద్యుత్ స్తంభాలను తక్షణమే తరలించాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. రోడ్డు విస్తరణకు ప్రభావితమవుతున్న నివాస భవనాల యజమానులకు పరిహారం చెల్లించి తొలగింపు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. జాతీయ రహదారి పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని మున్సిపల్ అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఎస్పీ పరితోశ్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రఘువీర్, ఇస్నాపూర్ మున్సిపల్ కమిషనర్ వెంకటకిషన్, డీఎస్పీ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
వాగులు, కాలువలు కబ్జా చేస్తే చర్యలే
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): రహదారి మీదుగా వెళ్లే వాగులు, కాలువలు కబ్జాలకు గురైతే అధికారులపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ప్రతీక్ జైన్ హెచ్చరించారు. మండలంలోని పెద్దాపూర్ శివారులో రానున్న వర్షాకాలం నేపథ్యంలో ప్రమాదకరంగా ఉన్న రోడ్డును ఎస్పీ పరితోశ్ పంకజ్తో కలిసి పరిశీలించారు.
కలెక్టర్ ప్రతీక్జైన్


