ములుగు(గజ్వేల్): పెరుగుతున్న పర్యావరణ కాలుష్యం, జీవవైవిధ్య నష్టాన్ని నివారించడానికి అడవులు, వన్యప్రాణులను పరిరక్షించడం అత్యవసరమని రాష్ట్ర ప్రధాన అటవీ సంరక్షణ అధికారి, చీఫ్ వైల్డ్లైఫ్ వార్డెన్ వినయ్కుమార్ అన్నారు. ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ములుగు అటవీ కళాశాల పరిశోధన సంస్థలో శుక్రవారం నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడానికి అందరం బాధ్యత వహించాలని కోరారు. రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీ డైరెక్టర్, చీఫ్ కన్జర్వేటర్ డా.ప్రియాంక వర్గీస్ మాట్లాడుతూ.. పర్యావరణ విద్య, సామర్థ్య వృద్ధి ప్రజల భాగస్వామ్యం ద్వారానే దీర్గకాలిక స్థిరాభివృద్ధి సాధ్యమన్నారు. వాతావరణ మార్పుల నియంత్రణలో అడవుల పాత్ర అత్యంత కీలకమని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్లానింగ్, మానిటరింగ్ విభాగం ప్రొఫెసర్ ఎన్. ఉమేశ్ పేర్కొన్నారు. పరిశోధన విధానాలు ప్రజల భాగస్వామ్యాన్ని సమన్వయం చేయడం ద్వారానే పర్యావరణ పరిరక్షణ సమర్థవంతంగా సాగుతుందని టీఎస్ఎఫ్డీసీ శాస్త్రవ్తేత్త, రీసెర్చ్ కన్సల్టెంట్ డా. శ్రీనివాస్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రముఖ కవి, రచయిత, గాయకుడు పర్యావరణవేత్త జయరాజు ప్రసంగం సభికులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఉస్మానియా ఇంజనీరింగ్ కళాశాల ప్రొఫెసర్ కులకర్ణి శశికాంత్, అటవీ కళాశాల డీన్ బి.ప్రవీణ, అధ్యాపకులు, అటవీశాఖ అధికారులు, పర్యావరణ నిపుణులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
మొక్కలు నాటుతున్న వినయ్కుమార్
రాష్ట్ర ప్రధాన అటవీ సంరక్షణఅధికారి వినయ్కుమార్


