దుబ్బాక: తల్లిదండ్రులు, స్నేహితులతో కలిసి ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయస్సులో మాయదారి రోగం బారిన పడి ఆరేండ్ల చిన్నారి ఆస్పత్రిలో ప్రాణపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంది. తమ బిడ్డను కాపాడుకునేందుకు ఉన్న ఆస్తిపాస్తులు అమ్మి ఖర్చు చేసినా వ్యాధి నయం కాలేదు. దీంతో చికిత్స కోసం పెద్ద మొత్తంలో డబ్బులు అవసరమవ్వడంతో ఆ తల్లిదండ్రులు సాయం చేయాలని దాతలను వేడుకుంటున్నారు.
దినదిన గండంగా చిన్నారి..
సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఘనపూర్ గ్రామానికి చెందిన శివాంది లింగం, లాస్య దంపతులకు కొడుకు, కూతురు రియాన్షిక(6) ఉన్నారు. లింగం ప్రైవేట్ ఉద్యోగి. ఆర్థికంగా అంతంత మాత్రంగానే ఉన్న కుటుంబం. ఈ క్రమంలో రియాన్షిక పుట్టిన నెల రోజులకే తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఆస్పత్రికి వెళ్తే వైద్యులు పరీక్షించి అరుదైన వ్యాధి తలసేమియాగా గుర్తించారు. దీంతో అప్పటి నుంచి ఆరేళ్లుగా ఆ చిన్నారి దినదిన గండంగా మంచానికి పరిమితమై ప్రాణాపాయ స్థితిలో కాలం గడుపుతోంది. బిడ్డను కాపాడుకునేందుకు చిన్నారి తల్లిదండ్రులు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చికిత్స కోసం ఉన్న ఆస్తిని అమ్మి, అప్పులు చేసి రూ.34 లక్షలకు పైగా ఆస్పత్రుల్లో ఖర్చు చేశారు. చికిత్సకు మరో రూ.30 లక్షల వరకు కావాలని వైద్యులు ఎస్టిమేషన్ వేశారు. మానవతావాదులు, దాతలు ఆర్థికంగా చేయూత నందించాలని రియాన్షిక తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రస్తుతం చిన్నారి హైదరాబాద్లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
తలసేమియాతో బాధపడుతున్నఆరేళ్ల రియాన్షిక
ఇప్పటికే ట్రీట్మెంట్కు రూ.34 లక్షలు ఖర్చు
దాతల సాయం కోసం ఎదురుచూపులు


