వెల్దుర్తి(తూప్రాన్): వృద్ధురాలిని నమ్మించి, బెదిరించి చెవి బంగారు కమ్మలు అపహరించిన కేసులో ఇద్దరిని రిమాండ్ చేశారు. శుక్రవారం తూప్రాన్ సీఐ వెంకట్రాజగౌడ్ కేసు వివరాలు వెల్లడించారు. గత నెల 30న మండలంలోని రామాయిపల్లికి చెందిన రాపర్తి రాజమ్మ ఆరెగూడెం గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లడానికి సెంట్రల్ బ్యాంక్ వద్ద వేచి ఉంది. ఈ క్రమంలో నర్సాపూర్కు చెందిన ఆటో డ్రైవర్లు శ్రీకాంత్, శైలని ఆరెగూడెంలో దింపుతామని నమ్మబలికి ఆటోలో ఎక్కించుకున్నారు. ఆరెగూడెం స్టేజీ వద్ద దింపకుండా వృద్ధురాలిని భస్వాపూర్ శివారులోని చెరువు కట్ట ప్రాంతానికి తీసుకెళ్లి కత్తితో బెదిరించి బంగారు చెవి కమ్మలను ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసిన పోలీసులు నర్సాపూర్ తూప్రాన్ బ్రిడ్జి వద్ద నిందితులను అరెస్ట్ చేశారు. చోరీ సొత్తును దుండగులు విక్రయించిన కృష్ణ జ్యువెల్లరి, కొత్తూరు నుంచి స్వాధీనం చేసుకొని, ఆటోను సీజ్ చేశారు.


