నర్సాపూర్: ఉద్రిక్తతల మధ్య ఆక్రమించి నిర్మించిన పాన్షాపు, షెడ్డుకు రెవెన్యూ శాఖ, పోలీసుల సహాయంతో ఆర్టీసీ అధికారులు శుక్రవారం తాళం వేశారు. వివరాలిలా.. స్థానిక ఆర్టీసీ బస్టాండు ఇన్ గేట్ను ఆనుకుని నిర్మించిన షెడ్డును స్వాధీనం చేసుకోవాలని ఇటీవల జిల్లా కోర్టు ఆర్టీసీ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా శుక్రవారం మెదక్ ఆర్టీసీ డిపో ఆఫీస్ సూపర్వైజర్ రాధాకృష్ణ, స్థానిక డిపో ఇన్చార్జి లక్ష్మణ్ మండల ఆర్ఐ ప్రభాకర్, పోలీసుల సహాయంతో షెడ్డు, పాన్డబ్బాలకు తాళం వేయడానికి వెళ్లగా యజమాని షర్పోద్దీన్ అధికారులను అడ్డుకొని వాగ్వాదానికి దిగాడు. స్వాధీనం చేసుకోవాలని కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని చెప్పగా షర్పోద్దీన్ పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. కాగా అక్కడే ఉన్న పోలీసులు ఇతర అధికారులు అతడికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు. అనంతరం షెడ్డు, పాన్డబ్బాలకు తాళం వేసి స్వాధీనం చేసుకున్నారు. పలువురు ఆర్టీసీ ఉద్యోగులు జీవీగౌడ్, శ్రీనివాస్, రాథోడ్ తదితరులు ఉన్నారు.


