తరచూ ప్రమాదాలు
● నివారణ చర్యలు తీసుకోవడంలో జాప్యం
జహీరాబాద్ టౌన్: జాతీయ రహదారిపై పలు చౌరస్తాలు ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. ఫోర్లేన్ రోడ్డుగా విస్తరించిన చౌరస్తాల వద్ద ప్రమాదాల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోనందున తరచూ అక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలు జరుగుతున్న ఈ ప్రాంతాలను ‘బ్లాక్స్పాట్’లుగా గుర్తించిన రోడ్లు భవనాల శాఖ అధికారులు అక్కడ అండర్ బ్రిడ్జిల నిర్మాణంలో మాత్రం ఎడతెగని జాప్యాన్ని ప్రదర్శిస్తున్నారు. హైదరాబాద్–ముంబై జాతీయ రహదారిని నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరించి పట్టణం పక్కనుంచి బైపాస్ నిర్మించారు. బైపాస్ రోడ్డుపై ప్రధాన చౌరస్తాల వద్ద అండర్ బ్రిడ్జిలు నిర్మించనందున ప్రమాదాలు జరిగి చాలామంది వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారు. జహీరాబాద్ బైపాస్ రోడ్డులో అల్గోల్ చౌరస్తా, రాయిపల్లి(డి), కోహీర్ మండలంలోని దిగ్వాల్, కొత్తూర్(డి) చిత్తల్ఘాట్, హుగ్గెలి, బూచినెల్లి, సత్వార్ చౌరస్తాలు డెత్ స్పాట్లుగా మారాయి.
బ్లాక్స్పాట్గా అల్గోల్ చౌరస్తా
బైపాస్ రోడ్డులోని అల్గోల్ చౌరస్తా మరీ ప్రమాదకరంగా తయారైంది. అల్గోల్, భరత్నగర్,ఎల్గోయి, దిడ్గి, పొట్పల్లి తదితర గ్రామాల ప్రజలు చౌరస్తా దాటి వెళ్లాల్సి వస్తోంది. జాతీయ రహదారి కావడంతో వాహనాల రద్దీ అధికంగా ఉన్నందున రోడ్డు దాటేందుకు సైతం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారి దాటే సమయంలో వేగంగా వస్తున్న వాహనాలు ఢీకొని ప్రమాదాలు జరుగుతు న్నాయి. ఇప్పటివరకు పలు ప్రమాదాలు చోటుచేసుకుని పలువురు ప్రాణాలు కోల్పోగా ఎంతోమంది గాయపడ్డారు. అల్గోల్ చౌరస్తాను ‘బ్లాక్స్పాట్’గా గుర్తించి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. వాహనాల వేగం నియంత్రించేందుకు స్పీడ్ బ్రేకర్లు, స్టాపర్లు ఏర్పాటు చేయలేదు. అల్గోల్లో చౌరస్తా విషయమై ఎమ్మెల్యే మాణిక్రావు ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసి చౌరస్తాలో అండర్ బ్రిడ్జి నిర్మించాలని కోరారు. అయినా ఇంతవరకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. చౌరస్తాల వద్ద ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రమాదకరంగా కల్వర్టు
జహీరాబాద్ పట్టణంలోని బస్టాండ్ నుంచి హౌసింగ్ బోర్డుకు వెళ్లే రోడ్డు మధ్యలో నిర్మించిన కల్వర్టు పూర్తిగా దెబ్బతింది. స్లాబ్ ధ్వంసమై గుంత పడి ఇనుపకడ్డీలు పైకి తేలడం వల్ల మోటారు బైక్ టైర్లు దెబ్బతింటున్నాయి. మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే దెబ్బతిన్న కల్వర్టుకు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.


