అదనపు కలెక్టర్ సంగీత
హత్నూర(సంగారెడ్డి): రైస్ మిల్లర్లు ఎక్కడైనా నిర్లక్ష్యం వహిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని, అనుమతులను సైతం రద్దు చేస్తామని అదనపు కలెక్టర్ సంగీత హెచ్చరించారు. హత్నూర మండలం దౌల్తాబాద్, కాసాల, బోరపట్ల గ్రామ శివారులలోని రైస్మిల్లులను గురువారం ఆమె పరిశీలించారు. ధాన్యం లోడు లారీలను వెంటనే కూలీల చేత ఖాళీ చేయించాలని లేకుంటే ధాన్యం నిలువల తరలింపులో ఆలస్యం జరుగుతోందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని తూకం వేసి లారీలో రైస్ మిల్లుకు వచ్చిన తర్వాత ఆలస్యం జరగనివ్వకుండా హమాలీల చేత లారీలను అన్లోడ్ చేయాలని ఆదేశించారు. రైస్మిల్లుల వద్ద ధాన్యం లారీలు ఎక్కువగా ఉండటంతో అసహనం వ్యక్తం చేశారు.
పకడ్బందీగా
ఓటరు మ్యాపింగ్
ఆర్డీఓ దేవూజా
జహీరాబాద్ టౌన్: ఓటరు మ్యాపింగ్ను పకడ్బందీగా నిర్వహించాలని ఆర్డీఓ దేవూజా అధికారులను ఆదేశించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం సమావేశ మందిరంలో గురువారం బీఎల్ఓ, సూపర్వైజర్లకు పీపీటీ ద్వారా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో దేవూజా పాల్గొని మాట్లాడారు. మ్యాపింగ్ కోసం క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లినప్పుడు ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మాస్టర్ ట్రైనర్లు తులసీరాం రాథోడ్, శ్రీనివాస్ ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ, ఓటర్ల తొలగింపు, కొత్త ఓటర్ల నమోదు, మార్పులకు సంబంధించిన దరఖాస్తుల విధానం తదితర అంశాలపై బీఎల్ఓలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో తహసీల్దార్ దశరథ్, మున్సిపల్ కమిషనర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
8న అప్రెంటిషిప్ మేళా
హత్నూర( సంగారెడ్డి): ఐటీఐలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు తమ క్యాంపస్లో ఈనెల 8న అప్రెంటిషిప్ మేళా నిర్వహించనున్నట్లు హత్నూర ఆర్ఐటీఐ ప్రిన్సిపాల్ సుబ్బలక్ష్మి గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని ట్రేడ్లలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో అప్రెంటిషిప్ కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనుందని, ఆసక్తిగల అభ్యర్థులు సంస్థ వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకుని విద్యార్హత ధ్రువపత్రాలతో మేళాకు హాజరుకావాలని సూచించారు.
పరిపూర్ణ ఆరోగ్యంతో
ఉండాలి: గూడెం
పటాన్చెరు టౌన్: మాజీమంత్రి, బీఆర్ఎస్ పార్టీ శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఆయనకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. హైదరాబాద్లోని హరీశ్రావు నివాసంలో ఆయనను కలిసిన గూడెం శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...హరీశ్రావు పరిపూర్ణ ఆరోగ్యంతో, చిరకాలం ప్రజాసేవలో ఉండాలని ఆయన అభిలషించారు.
బీజేపీ జిల్లా కార్యదర్శి రాజీనామా
నారాయణఖేడ్: బీజేపీ జిల్లా కార్యదర్శి పదవితోపాటు పార్టీ సభ్యత్వానికి అరుణ్ శేరికార్ గురువారం రాజీనామా చేశారు. పార్టీలో క్రమశిక్షణతోనే తాను మెలిగానని తన పనిని మెచ్చి పార్టీలో కీలకమైన పదవినిచ్చి గౌరవించినందుకు పార్టీశ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. కొన్ని అనివార్యకారణాల వల్ల మాత్రమే రాజీనామా చేస్తున్నాని పేర్కొంటూ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గోదావరికి రాజీనామా లేఖను పంపించారు.


