● తంగడపల్లిలో చిరుతపులి సంచారం ● భయాందోళనలో చుట్టుపక్కల గ్రామాలు ● పొలాలకు వెళ్లేందుకు జంకుతున్న రైతులు ● ఖరీఫ్ పనులకు ఆటంకం
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): మండలంలోని తంగడపల్లి శివారులో చిరుతపులి సంచరిస్తుండటంతో గ్రామస్తుల్లో భయాందోళన రోజురోజుకు తీవ్రతరమవుతోంది. గత నెల 27న గ్రామ శివారులోని సోలార్ ప్లాంట్లో చిరుతపులి సంచరించినట్లుగా అటవీ అధికారులు ఆనవాళ్లు గుర్తించారు. జరిగి పదిరోజులవుతున్నా ఇప్పటివరకు దాని ఆచూకీని కనుగొనడంలోగానీ, బంధించడంలో గానీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
వ్యవసాయపనులకు ఇబ్బంది
ఖరీఫ్ వ్యవసాయ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో వ్యవసాయ పనులకు వెళ్లేందుకు రైతులు, కూలీలు జంకుతున్నారు. రాత్రివేళల్లో ఒంటరిగా బయటకు రావడానికి, పొలాలకు వెళ్లడానికి రైతులు, కూలీలు భయపడుతున్నారు. ఎప్పుడు ఏవైపు నుంచి చిరుత దాడి చేస్తుందోనని స్థానికులు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. చిరుతపులి ఆనవాళ్లు, ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చుట్టుపక్కల గ్రామాల్లోనూ ఆందోళన నెలకొంది. పది రోజులుగా ఈ ప్రదేశంలో చిరుతపులి సంచరిస్తున్నా అధికారులు మాత్రం ఒకటి, రెండుసార్లు వచ్చారే తప్ప ప్రజల రక్షణకు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటవీ అధికారులు చిరుతను బంధించి, తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.


