కలెక్టర్ ప్రతీక్జైన్
కంది(సంగారెడ్డి): పంట మార్పిడితో అధిక దిగుబడితోపాటు లాభాలను పొందవచ్చని కలెక్టర్ ప్రతీక్జైన్ రైతులకు సూచించారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం కంది మండల పరిధిలోని జుల్కల్లో నిర్వహించిన గ్రామ సభలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అధిక లాభాలను అందించే పామాయిల్ సాగును ప్రోత్సహించాల్సిన అవసరముందన్నారు. రైతులందరూ భూసార పరీక్షలు చేయించుకుని ఫలితాలకు అనుగుణంగా వ్యవసాయ అధికారుల సూచనల మేరకు పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. జనగణన, ఎస్ ఐ ఆర్ లో ప్రజలందరూ తమ పేర్లను నమోదు చేసుకోవాలని స్పష్టం చేశారు. నమోదు కోసం వచ్చే అధికారులకు తమ కుటుంబ సభ్యుల వివరాలను తెలపాలన్నారు. అనంతరం గ్రామ శివారులోని పొలంలో సాగవుతున్న టమాటా పంటను కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మహమ్మద్ జుబేర్, డీఆర్డీఓ జ్యోతి, తహసీల్దార్ హసీనా బేగం, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీఓ మహేందర్రెడ్డి, ఏవో ఆసియా బేగంతోపాటు ఏఈ ఓలు, వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.


