పురుగు మందు తాగి
పటాన్చెరు టౌన్: భర్త చనిపోవడంతో ఒత్తిడికి లోనై మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని చిట్కుల్కు చెందిన రాములు 10 నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. అప్ప టి నుంచి అతని భార్య అనిత (34) ఒత్తిడికి లోనై మానసికంగా బాధపడుతూ ఉండేది. ఈ క్రమంలో ఈ నెల2న ఉదయం గుర్తు తెలియని క్రమిసంహారక మందు తాగింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను స్థానిక ఆస్పత్రికి, మెరుగైన వైద్యం క కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతురాలి కూతురు శిరీష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
అనుమానాస్పదంగా విద్యార్థి..
తూప్రాన్: అనుమానాస్పద స్థితిలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన పట్టణ పరిధిలోని రావెల్లి గ్రామ శివారులో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ గంగరాజు వివరాల ప్రకారం... పట్టణంలో నివాసం ఉంటున్న మహ్మద్ షరీఫ్ అహ్మద్ పెద్ద కుమారుడు అబ్బు హజీఫా(21) డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇంటి నుంచి మంగళవారం ఉదయం వెళ్లిన అతడు రాత్రయినా ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తే ఎత్తలేదు. బుధవారం రావెల్లి గ్రామ శివారులో వాటర్ గదిలో తాడుతో ఉరివేసుకొని మృతి చెందాడని పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుమారుడి మృతిపై అనుమానం ఉందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చికిత్స పొందుతూ యువకుడు..
పటాన్చెరు టౌన్: చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని చిన్న కంజర్లకు చెందిన మల్లికార్జున్ (26) గత నెల 27న రాత్రి ఇంట్లో నుంచి బయటకు బాత్రూమ్ కోసం వెళ్తూ కాలుజారి పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుడి తల్లి మంగమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


