మునిపల్లి(అందోల్): బూత్ లెవల్ అధికారులకు సహకరించి ఓటరు నమోదు చేయించుకోవాలని తహసీల్దార్ రంగారావు ప్రజలను కోరారు. బుధవారం ఎంపీడీఓ కార్యాలయంలో బూత్ లెవల్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సమావేశం నిర్వహించారు. ఈ నెల 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఆయా గ్రామాల్లో గ్రామ సభ కార్యక్రమం ఉంటుందన్నారు. గ్రామ సభలో 18 ఏళ్లు పూర్తయిన యువతీ యువకులు తమ ఓటును ఓటర్ల జాబితాలో నమోదు చేయించుకోవాలన్నారు. ఆధార్ కార్డు, చదువుకున్న సర్టిఫికెట్ల ప్రకారం 18 ఏళ్లు నిండిన వారు ఓటరు జాబితాలో తమ పేరు నమోదు చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 18 ఏళ్లు పూర్తయిన యువతీ యువకులు తమ పేర్లను బూత్ లెవల్ అధికారుల దగ్గర నమోదు చేయించుకోవాలన్నారు. బూత్ లెవల్ అధికారులు ఇంటింటికీ తిరిగి ఓటర్ల జాబితాలో పేర్లు లేని వారి వివరాలను నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి రామచారి, ఎంపీడీఓ అంజయ్య, బుదేరా ఎస్ఐ రాజేశ్ నాయక్, ఎంపీఓ అండాళ్లు, ఏపీఓ యాదయ్య, వ్యవసాయాధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.


