సిరిసిల్లఅర్బన్: ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. మంగళవారం సిరిసిల్ల మున్సిపల్ పరిధి సర్ధాపూర్లోని వ్యవసాయ మార్కెట్ యార్డు గోదాముల్లో ధాన్యం ఆన్లోడింగ్ తీరును అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్తో కలిసి పరిశీలించారు. హమాలీల సంఖ్యను మరింత పెంచి అన్లోడింగ్ వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని, అన్లోడింగ్ అయిన వాహనాలను ధాన్యం లోడింగ్ కోసం ఇతర కేంద్రాలకు తరలించాలని సూచించారు. గోదాముల్లో ధాన్యం నిల్వ చేస్తున్న తీరు, వాటి సామర్థ్యం వివరాలపై ఆరా తీశారు. వెనువెంటనే కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం లోడ్ చేసి తరలించేలా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. పౌర సరఫరాలశాఖ అధికారి బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, సిరిసిల్ల, వేములవాడ తహసీల్దార్లు మహేశ్, జయంత్ తదితరులు పాల్గొన్నారు.


