● ఎస్పీ మహేశ్ బి గితే
సిరిసిల్ల: జిల్లాలో బహిరంగంగా మద్యం సేవించడంపై నిత్యం తనిఖీలు నిర్వహించాలని, నేరాల నియంత్రణ, నిందితులకు శిక్ష పడేలా చర్యలు చేపట్టి బాధితులకు న్యాయం అందించేలా పనిచేయాలని ఎస్పీ మహేశ్ బి గితే ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీస్ ఆఫీస్లో సిరిసిల్ల సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, మారిన పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించి నేరాల దర్యాప్తు, నేరస్తుల గుర్తింపు, కేసుల నిర్వహణలో వేగం, పారదర్శకత పెంచాలని సూచించారు. గంజాయి, ఇసుక, పీడీఎస్ రైస్ అక్రమ రవాణా, గ్యాంబ్లింగ్పై ఆకస్మిక తనిఖీలు చేపడుతూ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ల పరిధిలో రోజూ సాయంత్రం డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాలన్నారు. రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నియంత్రణ, మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమీక్షలో డీఎస్పీ కె.నాగేంద్రచారి, సీఐలు శ్రీనివాస్, నాగేశ్వరరావు, వెంకటేశ్, మొగిలి, ఎస్సైలు, ఐటీ కోర్, డీసీఆర్బీ సిబ్బంది పాల్గొన్నారు.
నిత్యం డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు
శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా నిత్యం డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలని ఎస్పీ మహేశ్ బి గితే ఆదేశించారు. మంగళవారం రాత్రి జిల్లా కేంద్రంలోని విద్యానగర్ వద్ద పోలీస్ తనిఖీలను పరిశీలించారు. నంబరు ప్లేట్లు, సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేయాలని సూచించారు. మైనర్ల డ్రైవింగ్ను పట్టుకోవాలని, అసాంఘిక శక్తులను నిషితంగా పరిశీలించాలన్నారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఆర్ఎస్ఐ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.


