● ఎస్పీ మహేశ్ బీ గీతే ● టెన్త్, ఇంటర్ టాపర్లకు ప్రశంసలు
సిరిసిల్ల: పట్టుదల, క్రమశిక్షణ, కృషి ఉంటే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నారు. జిల్లా పోలీస్ ఆఫీస్(డీపీవో)లో టెన్త్, ఇంటర్ పరీక్షల్లో ప్రతిభ చూపిన పోలీస్ సిబ్బంది పిల్లలకు శనివారం కాలేజీ బ్యాగ్, మెమోంటో అందించారు. ఎస్పీ మాట్లాడుతూ తాను ప్రభుత్వ పాఠశాలలోనే చదివానని, తన తల్లిదండ్రులు ఇప్పటికీ వ్యవసాయం చేస్తున్నారన్నారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేవని నిరాశ చెందకుండా, కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చన్నారు. పోలీస్శాఖలో అహర్నిశలు ప్రజలకు సేవలందిస్తూ తమ పిల్లల భవిష్యత్ కోసం తాపత్రయ పడుతున్న తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించాలని పిల్లలకు సూచించారు. ప్రతి రోజు ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలన్నారు. మంచి స్నేహితులను ఏర్పాటు చేసుకోవాలన్నారు. జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీలు కె.నాగేంద్రచారి, శ్రీనివాసులు, జి.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


