సిరిసిల్ల: తెలంగాణ ఆవిర్భావ వేడుకలను దోహా ఖతర్లో బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వైభవాన్ని చాటిచెబుతూ.. తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో భారతీయ సాంస్కృతిక కేంద్రం(ఐసీసీ) వేదికగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు వైభవంగా జరిపారు. దోహా ఖతర్లోని తెలుగు ప్రజలకు ఎన్నో ఏళ్లుగా తెలంగాణ గల్ఫ్ సమితి స్వచ్చంద సేవలు అందిస్తుంది. ఆపదలో ఉన్న కార్మికులకు అండగా నిలుస్తూ, అత్యవసర పరిస్థితుల్లో సహాయ సహకారాలు అందిస్తూ, సామాజిక సేవా కార్యక్రమాలతో భారత రాయబార(ఎంబసీ) కార్యాలయం, ఖతర్ కార్మిక మంత్రిత్వ శాఖ, అంతర్జాతీయ కార్మిక సంస్థ, కార్మిక సంక్షేమ సంస్థలతో సమన్వయంగా పని చేస్తూ సమాజ సేవలో ముందుంది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా అమరవీరుల స్తూపాన్ని ఏర్పాటు చేసి నివాళి అర్పించారు. రాష్ట్ర గీతంతో పాటు, ఇతర ఆటా, పాటలతో కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకుంది. తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదా మధు, ప్రధాన కార్యదర్శి సంధ్య వినయ్, కార్యవర్గ ప్రతినిధులు భవానిసాగర్, దుర్గం రాజేశ్వర్, గడ్డి రాజు, శంకర్గౌడ్, ఎల్లయ్య తాళ్లపల్లి, యువజన విభాగ సభ్యులు ముకుందం, రాజేశ్, ప్రవీణ్, అరుణ్, ప్రసాద్, సుధాకర్, బొల్లె రాజ, గంగారం, దీపక్, మధు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమ నిర్వహణకు దాతలుగా సహకరించిన హరీశ్రెడ్డి, సాగర్, రాథోడ్లకు తెలంగాణ గల్ఫ్ సమితి కృతజ్ఞతలు తెలిపింది.


