సిరిసిల్ల: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు మంగళవారం సిరిసిల్లకు వస్తున్నారని ఆయన వ్యక్తిగత సహాయకుడు కుంభాల మహేందర్రెడ్డి సోమవారం తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో జరిగే కార్యక్రమంలో వీర్నపల్లి మండల కేంద్ర సర్పంచ్ మల్లారపు జ్యోత్స్న, అరుణ్తోపాటు వివిధ మండలాలకు చెందిన ఇతర పార్టీల నాయకులు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరతారని వివరించారు.
జేఈఈ అడ్వాన్స్డ్లో 1,235వ ర్యాంక్
సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రానికి చెందిన గాజుల వివేక్ జేఈఈ అడ్వాన్సుడ్లో ప్రతిభ చాటాడు. ఓపెన్ కేటగిరీలో 1,235వ ర్యాంకు, ఓబీసీలో 211వ ర్యాంక్ సాధించారు. ఇప్పటికే జేఈఈ మెయిన్లో 99.84 పర్సంటేజ్ సాధించారు. వివేక్ తల్లిదండ్రులు గాజుల శ్రీనివాస్–లావణ్య. శ్రీనివాస్ ప్రస్తుతం హైదరాబాద్ రైల్వేశాఖలో చీఫ్ విజిలెన్స్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. తల్లి లావణ్య గృహిణి. పదో తరగతిలో 97.5 శాతం మార్కులు, ఇంటర్మీడియట్లో 99 శాతం మార్కులు సాధించిన వివేక్ రాష్ట్ర స్థాయి ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష ఎప్సెట్లో 138వ ర్యాంక్ సాధించారు.
ఇల్లంతకుంట: కొనుగోలు కేంద్రాల్లో లోడింగ్ను వేగవంతం చేయాలని అడిషనల్ డీఆర్డీవో శ్రీనివాస్ సూచించారు. మండలంలోని దాచారం, సిరికొండ, తెనుగువానిపల్లి, ఐకేపీ కొనుగోలు కేంద్రాలను సోమవారం పరిశీలించారు. కొనుగోలు పూర్తయిన సెంటర్ల నుంచి వాహనాలను అధిక సంఖ్యలో పంపిస్తామన్నారు. రామచంద్రం, కొనుగోలు సెంటర్ల నిర్వాహకులు, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు.
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యాన్ని తూకం వేయడం లేదంటూ అన్నదాతలు రోడ్డెక్కారు. మండలంలోని రాచర్ల తిమ్మాపూర్ బస్టాండ్ వద్ద సిరిసిల్ల–కామారెడ్డి ప్రధాన రోడ్డుపై సోమవారం ధర్నా చేశారు. రైతులు మాట్లాడుతూ రాచర్ల తిమ్మాపూర్లో ఇంకా 150 వడ్ల కుప్పలు మిగిలి ఉన్నాయన్నారు. అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్నా ధాన్యం సేకరించడంలో జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ మండలాధ్యక్షుడు రేపాక రామచంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి దాసరి గణేశ్, నంది నరేశ్, కిరణ్నాయక్ పాల్గొన్నారు.
పోలీస్ సేవా పతకాలకు ఎంపిక
సిరిసిల్ల: జిల్లా పోలీస్శాఖలో పనిచేస్తున్న పలువురికి సేవా పతకాలను సోమవారం ప్రకటించారు. బోయినపల్లిలో పనిచేస్తున్న పోలీస్ కానిస్టేబుల్ బి.శ్రీనివాస్ పోలీస్ సేవా పతకానికి ఎంపికయ్యారు. సిరిసిల్ల శివారులోని సర్ధాపూర్ 17వ పోలీస్ బెటాలియన్కు చెందిన ఆర్ఐ కొంకటి శ్రీనివాస్, ఆర్ఎస్సై ఎం.రాజేశ్, ఏఆర్ఎస్సైలు ఎం.కనకరాజు, ఎం.ఆంజనేయులు, ఎస్.భరత్కుమార్ పోలీస్ సేవా పతకాలకు ఎంపికై నట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ శిఖాగోయల్ ప్రకటించారు. ఈమేరకు జూన్ 2న పోలీస్ సేవా పతకాలు అందుకోనున్నారు.
డీటీవోగా శ్రీనివాస్
సిరిసిల్లటౌన్: జిల్లా రవాణా శాఖ అధికారిగా దేవునూరి శ్రీనివాస్ నియమితులయ్యారు. రవాణాశాఖలో అధికారుల బదిలీలు చేస్తూ రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్ ఇళంబరితి ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం సిరిసిల్లలో డీటీవో, సిద్దిపేట ఇన్చార్జి డీటీవోగా పనిచేస్తున్న లక్ష్మణ్ను మంచిర్యాల జిల్లా మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్గా బదిలీ చేశారు. బోధన్లో విధులు నిర్వహిస్తున్న దేవునూరి శ్రీనివాస్ సిరిసిల్లకు బదిలీ అయ్యారు. ఆయనకు గతంలో సిరిసిల్ల ఎంవీఐగా పనిచేసిన అనుభవం ఉంది.


