తగ్గిన సాగు.. పెరిగిన ధరలు
సామాన్యుడి విలవిల
ఫలించని అధికారుల కృషి
పంట మార్పిడికి ముందుకురాని రైతులు
కూరగాయల ధరలు సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. గత పదిహేను రోజులతో పోల్చితే ధరలు రెట్టింపయ్యాయి. జిల్లాలో సాగు అంతంతే ఉండడం.. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవడమే ప్రధాన సమస్యగా అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో కూరగాయల సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు అవగాహన కల్పిస్తున్నా రైతులు పంటమార్పిడికి సహకరించడం లేదంటున్నారు. జిల్లాలో కూరగాయల సాగు, పెరిగిన ధరల నేపథ్యంలో ప్రత్యేక కథనం.
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): జిల్లా వ్యాప్తంగా 2.45లక్షల ఎకరాలకు పైగా సాగుభూమి ఉంది. ఇందులో అత్యధికంగా వరి, పత్తి సాగు చేస్తున్నారు. జిల్లాలోని 13 మండలాల వ్యాప్తంగా 500 ఎకరాల్లోనే రైతులు కూరగాయలు సాగుచేస్తున్నట్లు అధికారుల లెక్కలు తెలుపుతున్నాయి. స్థానికంగా దొరక్కపోవడంతో మహారాష్ట్ర, మదనపల్లి, అనంతపూర్ నుంచి దిగుమతి అవుతున్నాయి. ఇటీవల పెరిగిన ఇంధన ధరల భారం వినియోగదారులపై పడుతుంది. ఫలితంగా గత పదిహేను రోజులతో పోల్చితే కూరగాయల ధరలు రెట్టింపయ్యాయి. గతంలో కిలో టమాట రూ.50 ఉండగా నేడు రూ.100లకు చేరింది. వంకాయ, క్యాప్సికం, గోడుచిక్కుడు సైతం డబుల్ అయ్యాయి.


