● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ● రోడ్డు వెడల్పు పనులు పరిశీలన
వేములవాడ: పట్టణ అభివృద్ధికి ప్రణాళికతో ముందుకెళ్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజన్న ఆలయం వద్ద కొనసాగుతున్న రోడ్డు విస్తరణ పనులను ఆదివారం పరిశీలించారు. విప్ మాట్లాడుతూ ఆలయంతోపాటు పట్టణ అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. రాజన్న ఆలయంలో రూ.150కోట్లతో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. అందులో భాగంగా ఆలయం ముందు నుంచి బ్రిడ్జి వరకు 80 ఫీట్ల రోడ్డు విస్తరణ పనులు చేపట్టినట్లు చెప్పారు. పట్టణ సుందరీకరణ పనులకు రూ.2.60 కోట్లతో చేపడుతున్నట్లు తెలిపారు. అన్నదానసత్రం పనులు రూ.35కోట్లతో కొనసాగుతున్నాయన్నారు. బద్దిపోచమ్మ ఆలయం వద్ద పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్చైర్మన్ నరాల శేఖర్, మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ కనికరపు రాకేశ్, కౌన్సిలర్లు కొండా శేఖర్, అన్నారపు శ్రీనివాస్, కొక్కుల బాలకృష్ణ, తోట రాజు పాల్గొన్నారు.


