● కూడుకుపోతున్న ఒర్రెలు ● పెరిగిన భూముల ధరలు ● ఆక్రమణలో నిమ్మొర్రె ● పట్టించుకోని అధికారులు
వేములవాడఅర్బన్: ఆధ్యాత్మిక పట్టణం.. దక్షిణకాశీగా పేరొందిన వేములవాడలో ఖాళీ జాగ కనిపిస్తే చాలు కబ్జా చేసేస్తున్నారు. ఇటీవల భూముల ధరలకు రెక్కలు రావడంతో కాలువలు, ఒర్రెలను సైతం ఆక్రమణదారులు వదలడం లేదు. కాదేదు కబ్జాకు అనర్హం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో వర్షాలు కురిసినప్పుడు వరద నీరు ఒర్రెలు, కాలువల్లోకి చేరకుండా కాలనీల్లో పారుతోంది.
కబ్జాలో నిమ్మొర్రెలు
మారుపాక చెరువు అలుగు నుంచి నాంపల్లి చెరువు అక్కడి నుంచి మూలవాగులోకి నిమ్మొర్రె ఉంది. వర్షాలు కురిసినప్పుడు ఒక చెరువు నుంచి మరో చెరువుకు నీరు నిమ్మొర్రె ద్వారా వెళ్తోంది. పంట భూముల నుంచి వరదనీరు ఒర్రెలోకి చేరగానే అవి చెరువులోకి, చెరువు నుంచి మూలవాగులోకి చేరుతుంటాయి. కానీ ఆ పెద్ద ఒర్రెలు చిన్నగా మారి కనుమరుగవుతున్నాయి.
కూడుకుపోతున్నాయి
నిమ్మొర్రెలు కూడుకుపోతున్నాయి. వ్యవసాయ భూముల నుంచి రియల్ భూములుగా మారిన చోట ఒర్రెలను కూడుపుకుంటూ ప్లాట్ చేసినట్లు కొందరు ఆరోపిస్తున్నారు. దీంతో వర్షాలు కురిసినప్పుడు ఒర్రెల్లోకి నీరు వెళ్లకుండా పంట భూముల్లో ఉండి రైతులకు ఇబ్బందిగా మారింది. తిప్పాపూర్–నాంపల్లి శివారులో నిమ్మొర్రె కూడుకుపోవడంతో వర్షం నీరు ఇళ్లలోకి వస్తోంది. ప్రతీ సంవత్సరం తిప్పాపూర్లోని బుడగజంగాలకాలనీ, సౌరలకాలనీల్లోని ఇళ్లలోకి వరదనీరు వస్తోంది. ఈ నిమ్మొర్రె పూర్తిస్థాయిలో హద్దులు ఏర్పాటు చేసి ముళ్లపొదలను తొలగిస్తే వరదనీరు ఇళ్లలోకి రాకుండా ఉంటుందని స్థానికులు కోరుతున్నారు.
హద్దులు ఏర్పాటు చేయాలి
మారుపాక చెరువు అలుగు నుంచి నాంపల్లి చెరువు అక్కడి నుంచి మూలవాగు వరకు నిమ్మొర్రె దాదాపు ఐదు కిలోమీటర్ల పైన ఉంది. ఈ ఒర్రె ఒడ్డును పట్టుకుని అటు, ఇటు రెండు వైపులా తొమ్మిది మీటర్లు వదిలిపెట్టాలి. ఆ తర్వాత భూములను సాగు, లేదా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. కాని ఇక్కడ మాత్రం ఒర్రెలను కూడుపుకుంటూ భూములు చదును చేసి అమ్ముతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు నిమ్మొర్రె కాలువకు హద్దులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.


