● రెండు ట్రాన్స్ఫార్మర్లు.. 60 పోల్స్ పునరుద్ధరణ ● 20 గంటలపాటు శ్రమించిన విద్యుత్ సిబ్బంది ● ఎన్పీడీసీఎల్ ఎస్ఈ టి.వేణుగోపాల్
సిరిసిల్లటౌన్/తంగళ్లపల్లి(సిరిసిల్ల): ప్రకృతి ప్రకోపానికి విద్యుత్శాఖకు రూ.10లక్షలు నష్టం వాటిల్లిందని ఎన్పీడీసీఎల్ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజినీర్ టి.వేణుగోపాల్ తెలిపారు. గురువారం రాత్రి అకస్మాత్తుగా గాలి, వాన బీభత్సంతో సిరిసిల్లలోనే అత్యధికంగా విద్యుత్లైన్లు దెబ్బతిన్నాయన్నారు. రెండు ట్రాన్స్ఫార్మర్లతోపాటు సుమారు 40కి పైగా పోల్స్ను పునరుద్ధరించినట్లు పేర్కొన్నారు. తంగళ్లపల్లి, వేములవాడ సబ్డివిజన్లతో కలిసి మొత్తంగా 60 చోట్ల విద్యుత్లైన్లు దెబ్బతినగా 60 పోల్స్ను పునరుద్ధరించినట్లు పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి దాదాపు 20 గంటలపాటు ఎన్పీడీసీఎల్ సిబ్బంది శ్రమించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారని తెలిపారు. ఆయా పనులను డీఈ అంజయ్యతో కలిసి పర్యవేక్షించారు.
విద్యుత్ సరఫరా పునరుద్ధరణ
తంగళ్లపల్లి మండలంలో గురువారం రాత్రి వీచిన గాలి దుమారంతో తాడూర్, గోపాలరావుపల్లి గ్రామాల్లో విద్యుత్ వ్యవస్థ ధ్వంసమైంది. 11 కేవీ లైన్తోపాటు ఎల్టీ లైన్కు సంబంధించిన దాదాపు 12 స్తంభాలు, ఒక ట్రాన్స్ఫార్మర్ నేలకొరిగాయి. వెంటనే విద్యుత్ సిబ్బంది క్షేత్రస్థాయిలోకి వచ్చారు. ఎన్పీడీసీఎల్ ఎస్ఈ వేణుగోపాల్, డీఈ అంజయ్య, ఏడీఈ గోపీనాథ్ పర్యవేక్షణలో పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఏఈ మధుకర్ ఆధ్వర్యంలో సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. తెల్లవారుజామున 3 గంటల వరకు దెబ్బతిన్న స్తంభాలను తొలగించి, కొత్తలైన్లు వేసి, ట్రాన్స్ఫార్మర్ను పునరుద్ధరించారు.


