● ధాన్యం తడిసినా కొనుగోలు చేస్తున్నాం ● టెలీకాన్ఫరెన్స్లో కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: జిల్లాలో కల్లాల్లో తడిసిన ధాన్యం ఉన్న రైతులు ఆందోళన చెందొద్దని, తడిసినా ధాన్యాన్ని వెంటనే రైస్మిల్లులకు తరలిస్తున్నామని కలెక్టర్ గరీమా అగ్రవాల్ భరోసా ఇచ్చారు. ముస్తాబాద్ మండలం పోత్గల్ ఐకేపీ కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని కలెక్టర్ ఆదేశాలతో ఐకేపీ, పౌర సరఫరాలశాఖ అధికారులు కొనుగోలు కేంద్రాన్ని గురువారం సందర్శించారు. దాదాపు 10 టన్నుల తడిసిన ధాన్యాన్ని నామాపూర్లోని బాలాజీ రైస్ ఇండస్ట్రీస్కు తరలించారు. జిల్లాలో బుధవారం నాటికి 2,23,709 టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని అధికారులు తెలిపారు.
వారం రోజుల్లో పూర్తి : కలెక్టర్
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వారం రోజుల్లో పూర్తి అయ్యేలా పనిచేయాలని కలెక్టర్ కోరారు. జిల్లాలోని అధికారులతో గురువారం టెలీకాన్ఫరెన్స్లో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాలు, మిల్లుల వారీగా ధాన్యం సేకరణ, అన్లోడింగ్పై ఆరా తీశారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఆన్లైన్ ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. వాహనాల కొరత లేకుండా చూడాలని ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లకు సూచించారు.


