కాంగ్రెస్‌ బలోపేతమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ బలోపేతమే లక్ష్యం

May 28 2026 2:10 AM | Updated on May 28 2026 2:10 AM

● ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ● అడిషనల్‌ డీఆర్డీవో శ్రీనివాస్‌ ● సీపీఐ నాయకుడు చాడ వెంకట్‌రెడ్డి

● ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

బోయినపల్లి(చొప్పదండి): కాంగ్రెస్‌ బలోపేతమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కోరారు. మండలంలోని వెంకట్రావుపల్లికి చెందిన పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు బుధవారం కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు సువీన్‌యాదవ్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారు. సర్పంచ్‌ ఇరువాల సంధ్య, నాయకులు మానాల నారాయణ, ఇంద్రారెడ్డి, దూస రాజశేఖర్‌, సాయికృష్ణ, శ్రీకాంత్‌, దయ్యాల రాజశేఖర్‌, ఎం.రజనీకాంత్‌ పాల్గొన్నారు.

అన్‌ లోడింగ్‌ వేగవంతం చేయాలి

ఇల్లంతకుంట(మానకొండూర్‌): కొనుగోలు కేంద్రం నుంచి లోడింగ్‌తో వెళ్లిన ధాన్యం వాహనాలను రైస్‌మిల్లుల వద్ద త్వరగా అన్‌లోడింగ్‌ చేసుకోవాలని అడిషనల్‌ డీఆర్డీవో శ్రీనివాస్‌ సూచించారు. మండలంలోని కిష్టారావుపల్లి రైస్‌మిల్లును బుధవారం తనిఖీ చేశారు. రైస్‌మిల్లు వద్ద దాదాపు 80 ట్రాక్టర్ల వరకు బారులు తీరాయి. వరుస ప్రకారం వెళ్లి అన్‌లోడింగ్‌ చేసుకోవాలని ట్రాక్టర్‌ యజమానులకు సూచించారు. ఐకేపీ ఏపీఎం కుమారస్వామి, వల్లంపట్ల సర్పంచ్‌ నేరెళ్ల విజయ్‌గౌడ్‌, కిష్టారావుపల్లి సర్పంచ్‌ జక్కుల మల్లవ్వ, మహిళ సమాఖ్య మండల అధ్యక్షురాలు కట్ట సౌమ్య, సీసీ రాజేశ్వరీ పాల్గొన్నారు.

మోదీ వచ్చాక రూ.160 లక్షల కోట్లు అప్పు పెరిగింది

వేములవాడ: మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పుడు రూ.50 లక్షల కోట్లు అప్పుండేదని.. ఇప్పుడు రూ.160 లక్షల కోట్లకు చేశాడని సీపీఐ రాష్ట్ర నాయకుడు చాడ వెంకట్‌రెడ్డి ఆరోపించారు. వేములవాడలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. కార్పోరేట్‌ సంస్థల అధిపతులు అంబానీ, అదానీలకు దేశాన్ని దారాదత్తం చేస్తున్నారన్నారు. రైతులను పట్టించుకున్న పాపాన పోవడం లేదన్నారు. రైతులను జాగృతం చేసేందుకు జూన్‌ 5, 6, 7 తేదీల్లో వేములవాడలో సీపీఐ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

పెరుక రాజుకు సాహిత్య శిరోమణి పురస్కారం

సిరిసిల్లటౌన్‌: ప్రముఖ కవి, రచయిత, బహుభాషావేత్త డాక్టర్‌ పెరుక రాజు ‘విశ్వవిఖ్యాత సాహిత్య శిరోమణి పురస్కారం– 2026’కు ఎంపికయ్యారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో పురస్కారం అందుకున్నారు. సామాజిక చైతన్య రచనల ద్వారా సాహిత్యరంగంలో రాజు సేవలకు ఈ గౌరవం దక్కింది. ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో హైదరాబాద్‌లోని తెలుగు విశ్వవిద్యాలయంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. కాగా ఏడాదిలోనే రాజు తొమ్మిది పురస్కారాలు అందుకున్నారు.

జిల్లా ఎస్‌డీసీగా కుమారస్వామి

సిరిసిల్ల: జిల్లా భూసేకరణ విభాగం ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌గా జి.కుమారస్వామిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని 12 మంది అధికారులను బదిలీ చేశారు. పెద్దపల్లి జిల్లాలో పనిచేస్తున్న జి.కుమారస్వామిని రాజన్న సిరిసిల్ల ఎస్‌డీసీగా నియమించారు. గతంలో జిల్లాలో ఎస్‌డీసీగా పనిచేసిన రాధాబాయి బదిలీ అయ్యారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement