● అత్యధికంగా బోయినపల్లిలో 45.6 డిగ్రీలు ● అత్యల్పంగా ఆవునూర్లో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు
బోసిపోయిన సిరిసిల్లలోని గాంధీచౌక్
సిరిసిల్ల: ఎండలు భగభగ మండిపోతున్నాయి. మంగళవారం వడగాలులతో జనం అల్లాడిపోయారు. పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. రోహిణీ కార్తె ప్రవేశించడంతో చల్లని వర్షం కబురు వస్తుందని జిల్లా రైతులు ఆశించారు. గాలిదుమారం తప్ప వర్షం చినుకు పడలేదు. జిల్లాలోని బోయినపల్లి మండలంలో అత్యధికంగా 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. రుద్రంగిలో 45.4, వేములవాడ అర్బన్ మండలం నాంపల్లి వద్ద 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చందుర్తి మండలం మర్రిగడ్డ 44.8, ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ 44.7, కలెక్టరేట్, ఇల్లంతకుంటలో 44.6, రుద్రంగి మండలం మానాల, వేములవాడ రూరల్ మండలం మల్లారం వద్ద 43.9, కోనరావుపేట మండలం మర్తనపేట 43.7, ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ వద్ద 43.4, కోనరావుపేట మండలం నిజామబాద్ 43.3, వేములవాడ రూరల్ మండలం వట్టెంల వద్ద 43.1, ముస్తాబాద్ మండలం నామాపూర్ వద్ద 43, సిరిసిల్ల శివారు పెద్దూరులో 42.9,
తంగళ్లపల్లి మండలం నేరెళ్ల వద్ద 42.8, వీర్నపల్లి 42.7, గంభీరావుపేట మండలం గజసింగారం వద్ద 42.5, గంభీరావుపేట 42.4, ఎల్లారెడ్డిపేట 42.3, ముస్తాబాద్ మండలం ఆవునూరు వద్ద 42.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
బోసిపోయిన వీధులు
ఎండల ధాటికి పగటి పూట సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లోని వీధులు బోసిపోయాయి. ఎండలు.. వడగాలులతో జనం ఇబ్బంది పడ్డారు. అత్యవసర పనుల కోసం రోడ్డుపైకి వచ్చిన వారు నెత్తిన టవల్స్తో కనిపించారు. ఎప్పుడూ రద్దీగా ఉండే సిరిసిల్ల పట్టణ గాంధీచౌక్ కూడలి జనసంచారం లేక వెలవెలబోయింది. ఎండల వేడి తగ్గించే చల్లని వర్షాల కోసం జనం నిరీక్షిస్తున్నారు.


