● కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం కలెక్టరేట్లో ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియను నిబంధనలు అనుగుణంగా కలెక్టర్ గరీమా అగ్రవాల్ అధ్యక్షతన నిర్వహించారు. ఆయా శాఖల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వివరాలను సంబంధిత జిల్లా అధికారులు కలెక్టర్కు అందించారు. ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న స్థానం నుంచి ఇతర స్థానాలకు పారదర్శకంగా సిబ్బందిని బదిలీ చేశామని కలెక్టర్ తెలిపారు.
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి
హమాలీల సంఖ్యను పెంచి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ, గోదాంలకు తరలింపు తదితర అంశాలపై అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, పౌరసరఫరాల అధికారులతో మంగళవారం ఉదయం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మిల్లుల వారీగా ఎంతవరకు ధాన్యం అన్ లోడింగ్ చేశారో వివరాలు అడిగి, హమాలీల సంఖ్య పెంచుకునేలా యజమానులకు ఆదేశాలు జారీ చేయాలన్నారు. వర్షాలు పడే అవకాశం ఉన్నందున కేంద్రాల్లో ఉన్న బస్తాలను వెంటనే మిల్లులు, గోదాములకు తరలించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. టార్ఫాలిన్లు అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు. కొనుగోళ్లు పూర్తయిన కేంద్రాల నుంచి హమాలీలను అపరెల్ పార్క్ కు పంపించి, అన్ లోడింగ్ వేగవంతం చేయడంపై దృష్టి సారించాలని సూచించారు. రోజూ వారీగా కొనుగోళ్ల శాతం పెంచి, సాధ్యమైనంత త్వరగా సజావుగా పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు.


