సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ను, రాష్ట్ర ప్రగతిని పరుగులు పెట్టించిన కేటీఆర్ను విమర్శించడం మానుకొని.. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య హితవు పలికారు. సిరిసిల్ల తెలంగాణ భవన్లో ఆదివారం బీఆర్ఎస్ నేతలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంత్రివర్గ విస్తరణ అని ప్రకటన రాగానే ఆది శ్రీనివాస్ కేసీఆర్ను, కేటీఆర్ను విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని, మళ్లీ కేసీఆర్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్న సమయంలో మంత్రి పదవి కోసం ఉద్యమ నేతలను విమర్శించడం సరికాదన్నారు. రైతులు రెండు నెలలుగా ధాన్యం కొనుగోళ్లు లేక ఇబ్బందులు పడుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. నీ సొంతూరు రుద్రంగిలోనూ రైతులు వడ్లు కొనుగోలు చేయాలని ధర్నా చేస్తున్నారన్నారు. కేసీఆర్ను ఫామ్హౌజ్లో ఉన్నారని విమర్శించడం సరికాదని, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు ఉదంతంపై నోరు విప్పకపోవడం ఏంటని ప్రశ్నించారు. జిల్లాలో 90 శాతం పూర్తి అయిన మల్కపేట 9వ ప్యాకేజీని నిధులు సాధించాలని, సూరమ్మ చెరువు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికై నా కేసీఆర్, కేటీఆర్లను విమర్శించడం మానుకొని హామీలను అమలు చేయాలని కోరారు. బీఆర్ఎస్ నాయకులు జిందం చక్రపాణి, గూడూరి ప్రవీణ్, న్యాలకొండ అరుణ, బుర్ర మల్లికార్జున్గౌడ్, కుంబాల మల్లారెడ్డి, రాఘవరెడ్డి, ఎదురుగట్ల చంద్రయ్యగౌడ్, మ్యాన రవి, ఆకుల కృష్ణ, అడిశెర్ల సాయి, నంది శంకర్, గెంట్యాల శ్రీనివాస్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.


